తెలంగాణలో షాకుల మీద షాకులు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఓ తీపి కబురు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఆయన కుమారుడు బీజేపీలో చేరతారని ప్రచారం చేస్తున్నారు. దీనికి ఇటు కాంగ్రెస్ వైపు అటు బీజేపీ వైపు అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో వైరల్ అయిపోయాయి. అయితే తాజాగా ఓ కీలక ప్రకటన వెలువడింది. జానా రెడ్డి జంపింగ్ ఆగిపోయింది. అది కూడా కీలక ప్రకటనతో.
జానారెడ్డి జంపింగ్
నాగార్జునసాగర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. జానారెడ్డి ప్రాతినిథ్యం వహించిన చోటు కావడంతో కీలంగా మారింది. జానారెడ్డిపై ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ కూడా ఒత్తిడి తెస్తున్నాయని ప్రచారం సాగుతూ వస్తుంది. అయితే, ఈ ప్రచారంపై జానారెడ్డి తొలిసారి స్పందించారు. కొత్త పీసీసీ చీఫ్ ఎంపికలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యహారల ఇంచార్జ్ ఠాగూర్కు తన అభిప్రాయాన్ని జానారెడ్డి చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక కామెంట్లు చేశారు.
నేను సీఎం అవుతా పార్టీ ఎందుకు మారుతాను?
పార్టీ మార్పు వార్తలపై ఇవాళ జానారెడ్డికి ఠాగూర్ ఫోన్ చేయగా… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిని నేను.. ఎలా పార్టీ మారుతానని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు మీడియాతో మాట్లాడుతూ జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పు అంశంపై మీడియా చేసే ప్రచారమేనన్న జానారెడ్డి.. మీరు ప్రచారం చేసి నన్ను సమాధానం అడిగితే ఎలా? అంటూ ఎదురుప్రశ్నించారు. “పార్టీకి చెప్పాల్సింది చెప్పా.. ఏం చెప్పాలో అదే చెప్పా` అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. పీసీసీ ఎవరన్నది ఠాగూర్ చెబుతారన్న ఆయన.. నాగార్జున సాగర్ లో పోటీ అంశం కూడా పార్టీ చెబుతుందన్నారు.