వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ట్వీట్లు చేసే విజయసాయిరెడ్డి అదే ఒరవడిలో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధీశ్వరి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందంటూ విమర్శించారు. అయితే, ఈ కామెంట్లు వివాదంగా మారుతున్నాయి.
విజయసాయిరెడ్డి ఏమన్నారంటే….
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం బయట విలేకర్లతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వ్యవస్థల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా పరిమితులు విధించారని చెప్పారు. అయితే కొంతమంది ఆ పరిమితులను అతిక్రమించి స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలియజేశారు. బీజేపీ నేత పురంధీశ్వరిని టార్గెట్ చేశారు. పురందేశ్వరి ఈరోజు ఒక పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరావతి రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందంటూ విజయసాయి విమర్శించారు.
అయ్యన్న మండిపడ్డారు
విజయసాయిరెడ్డి ట్వీట్లు, కామెంట్లపై అయ్యన్నపాత్రుడు భగ్గుమన్నారు. విజయసాయికి పురందేశ్వరిని విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి అని, నందమూరి కుటుంబం అంటే తులసివనం వంటిదని అభివర్ణించారు. విజయసాయిరెడ్డి గంజాయివనంలో గంజాయి మొక్క లాంటి వాడేనని అన్నారు. అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ కాదు, దమ్ముంటే సీబీఐ దర్యాప్తు వేయండి అంటూ సవాల్ విసిరారు. ఈ కుంభకోణంలో రాజకీయ పార్టీల నేతలే కాదు, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారని ఆరోపించారు. అందరి జాతకాలు బయటికి వస్తాయని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
గతంలోనూ ఇలాగే…
ఇదిలా ఉంటే, తన ట్వీట్ల పరంపరతో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్థ్రాలు సంధించే విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు సైతం అదే రీతిలో పలు సందర్భాల్లో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలకు విశాఖ ప్రజలపై ప్రేమ లేదని… కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఇక్కడి భూమిపై మాత్రమే వారికి ప్రేమ ఉందని అన్నారు. గజపతిరాజులకు చెందిన రూ. 50 వేల కోట్ల విలువైన మాన్సాస్ ట్రస్టుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కన్ను పడిందని ఆరోపించారు. విశాఖలో కబ్జాలు, భూదందాలు ప్రారంభమయ్యాయని అన్నారు. విశాఖను రియలెస్టేట్ దందాకు అడ్డాగా విజయసాయి మార్చుకున్నారని చెప్పారు. భూదందాలో పట్టుబడినవారు తన మనుషులు కాదని విజయసాయి ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తోందని అన్నారు. పట్టుబడకుండా దందా చేస్తున్నవాళ్లు మాత్రమే మీవాళ్లా విజయసాయి అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా జైలు పక్షి అంటూ విమర్శించడం గమనార్హం.