వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు . సంచలన రాజకీయ నిర్ణయాలతో అతి తక్కువ కాలంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదే రీతిలో అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతున్నారు. జగన్ పుట్టినరోజున సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ కార్యక్రమాలు చేస్తుంటారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డేకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ గిఫ్ట్ నిజంగా విభిన్నం.
రోజా నిజంగా గ్రేట్
వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల్లో ఒకరైన నగరి ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వినూత్న సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ పేద అమ్మాయిని వైద్య విద్యను చదివించేందుకు ఎమ్మెల్యే రోజా పూనుకున్నారు. తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పుష్ప కుమారి డాక్టర్ కోర్సు చదివించే బాధ్యతను రోజా తీసుకున్నారు. ఏపీఐఐసీ చైర్మన్ రోజా తీసుకున్న ఈ నిర్ణయం ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.
ఆరోజు రోజా ఏం చేశారంటే….
నగరి ఎమ్మెల్యే రోజా ఈనెల 8వ తేదీన తిరుపతి గర్ల్స్ హోమ్ ను సందర్శించారు. హోమ్ సందర్శించినప్పుడు అక్కడి టీచర్లు, విద్యార్థులతో రోజా స్వయంగా మాట్లాడి అందరి వివరాలు తెలుసుకున్నారు. నీట్ లో ర్యాంక్ వచ్చినప్పటికీ ఆర్థిక స్తోమత లేక చదువు కొనసాగించలేని పరిస్థితిలో ఉన్న పుష్ప కుమారి అనే బాలిక గురించి తెలుసుకుని తానే స్వయంగా పూర్తి బాధ్యతతో దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పుట్టిన రోజు నాడు శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఓ పేద ఆడబిడ్డను డాక్టర్ చదివించేలా దత్తత తీసుకుంటానని లిఖితపూర్వకంగా హోం నిర్వాహకులకు తెలియజేశారు. సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా రోజా తీసుకున్న నిర్ణయం గురించి సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో.. రోజా పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనే కాదు.. ఇంటా బయటా.. అన్ని చోట్లా రోజాకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. రోజా డైనమిక్ నాయకురాలు మాత్రమే కాదు ..దయాగుణం ఉన్న గొప్ప మనిషి అని కితాబు ఇస్తున్నారు.