ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు ఢిల్లీ వేదికగా మరోమారు షాక్ తగలనుందా?
నిధుల వేటలో ఉన్న ఏపీ ప్రభుత్వం విషయంలో ఊహించని ఫిర్యాదు కేంద్రానికి చేరిందా? ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? ఇది ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్.
90,000 కోట్ల రూపాయలు ఇలా….
డిస్కం లిక్విడిటీ ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే 90,000 కోట్ల రూపాయల వాటాను, తమ బకాయలు తీర్చే దాకా ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తూ భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)), కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం. తమకు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలని కోరింది.
జగన్ సర్కారు ఫీలింగ్ ఇదే
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు డిస్కమ్లకు శాపంగా మారాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
మార్కెట్లో కారుచౌకగా విద్యుత్ లభిస్తున్నా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవటానికి ఐదేళ్ల క్రితం చేసుకున్న కొనుగోలు ఒప్పందాలే కారణం అని భావించింది. ‘2017 మార్చి 31తో పీపీఏల కాలపరిమితి ముగుస్తుండగా.. టీడీపీ ప్రభుత్వం మార్చి 15న హడావుడిగా 41 పీపీఏలు కుదుర్చుకుంది. 15 రోజుల్లో పవన విద్యుత్తు ప్లాంట్లు స్థాపించి ఉత్పత్తి చేయడం సాధ్యమా?’ అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. రెన్యువబుల్ ఎనర్జీ యూనిట్కు రూ.4.84 పడిందని, అదే థర్మల్ విద్యుత్తు యూనిట్ రూ.3లేనని దాంతో యూనిట్కు రూ.1.84 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.
థర్మల్ విద్యుత్తు వినియోగించకపోయినా ఫిక్స్డ్ చార్జీల కింద యూనిట్కు రూ.1.50 తప్పనిసరిగా చెల్లించాల్సి రావడంతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని తెలిపారు. 2014–15 నాటికి డిస్కంలు రూ.9 వేల కోట్ల నష్టాల్లో ఉండగా 2018–19 నాటికి రూ.29వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని ఆరోపించింది. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించింది.
కేంద్రానికి జగన్ సర్కారు లేఖ
విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి పునరుత్పాదన విద్యుత్ కొనుగోళ్ల కారణంగా భారీ నష్టాలు ఎదురవుతున్నాయని, అందుకే వీటి భారం కేంద్రమే భరించాలంటూ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్రమంత్రి ఆర్కేసింగ్ కు లేఖ రాశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 25 సంవత్సరాల వ్యవధి కోసం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించాలన్న జగన్ ప్రభుత్వ విధానాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ ఈ వ్యవహారం సరికాదంటూ రాష్ట్రానికి ఇప్పటికే మూడు లేఖలు రాశారు. ప్రతీ లేఖలోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష వల్ల ఎదురయ్యే సమస్యలను ఆయన ఏకరువు పెడుతూ వచ్చారు.
దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినకుండా ఉండాలన్నా, విద్యుత్ గ్రిడ్ కుప్పకూలకుండా ఉండాలన్నా, ఐక్యరాజ్యసమితి సూచనల ప్రకారం దేశ విద్యుత్ రంగంలో పునరుత్పాదన విద్యుత్ వాటా పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆగిపోకుండా ఉండాలన్నా పీపీఏల సమీక్ష చేయొద్దంటూ ఆర్కేసింగ్ పలుమార్లు హెచ్చరించారు.
కేంద్రం ఈ లేఖకు స్పందిస్తే అంతే సంగతా?
డిస్కంల లిక్విడిటీ ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించే సహాయాన్ని ఆపివేయాలని సీఐఐ కోరింది. కేంద్ర విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్కె సింగ్ కు రాసిన లేఖలో, ఏపి డిస్కంలు నిలిపివేసిన మొత్తాన్ని పునరుత్పాదక విద్యుత్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయలు, పూర్తిగా చెల్లించే వరకు నిలిపివేయాలని సీఐఐ తన లేఖలో తెలిపింది.
1 comment
Comments are closed.