ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ , ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయంగా ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ఓ మంత్రిని ఇలా బుక్ చేసేశారు. సదరు మంత్రే కన్నబాబు.
ఏం జరిగింది?
“కరప మండలం, గొర్రిపూడిలో సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్న బాబు సమక్షంలోనే యువతుల రికార్డ్ డాన్స్ ప్రోగ్రాం. ఆలయాలలో దేవుని దర్శనాలకు, పండగలకు, పంచాయితీ ఎన్నికలు జరపడానికి కోవిడ్ నిబంధనలు అడ్డు వస్తాయి కానీ ఇలాంటి రికార్డ్ డాన్సులకు మాత్రం కోవిడ్ నిబంధనలు అడ్డురావ…? ఇలాంటివి నియంత్రించాల్సిన పోలీసులే గుడ్లు అప్పచెప్పి చూస్తూ ఉండడం పోలీసు వ్యవస్థ ఈ జగన్ పాలనలో నిర్వీర్యమైపోయింది అనడానికి నిదర్శనం.“ అంటూ తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మంత్రిగారు జాగ్రత్తగా ఉండాలి కదా?
ప్రస్తుత పరిణామంలో మంత్రిని తెలుగుదేశం పార్టీ సులభంగా బుక్ చేసేసింది. వీడియోను సైతం పోస్ట్ చేసేసి మంత్రి కురసాల కన్నబాబు ను టార్గెట్ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో మంత్రి ఏ విధంగా ఈ వివాదంపై స్పందించనున్నారనే ఆసక్తి నెలకొంది.