ఏపిలో డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు కావడం సంచలనం అయ్యింది. ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ఫిర్యాదుతో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప,పై టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ను ఎస్పీ ఫకీరప్ప సర్వీస్ నుండి డిస్మిస్ చేశారు. కానిస్టేబుల్ పై అయిదు క్రిమినల్ కేసులు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారంటూ ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై ప్రకాశ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దళితుడిననే చిన్న చూపుతో కుట్రపూరితంగా తనపై తప్పుడు విచారణ జరిపి, వాంగ్మూలాన్ని రికార్డు చేశారని ప్రకాశ్ పేర్కొన్నారు. ఇందుకు బాధ్యలైన పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెక్షన్ 167, 177, 182, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న సమయంలో ఎస్పీ ఫకీరప్ప టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. కొద్దిసేపటికి ఆయన వెళ్లిపోయిన తర్వాత సీఐ శివరాముడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఐజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఇతర జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని డీఐజీ నిర్ణయించినట్లు సీఐ పేర్కొన్నారు.
మరో వైపు తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ విధుల నుండి తొలగించారని.. ఆ కేసులో పోలీసులు బాధితురాలిగా పేర్కొన్న బీ లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది జూన్ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన స్పందన సభకు సీఎం జగన్ హజరుకాగా తమ బకాయిలు చెల్లించాలంటూ అనంతపురం లో కానిస్టేబుల్ ప్రకాశ్ ప్లకార్డులు ప్రదర్శించడం సంచలనం అయ్యింది. దీంతో ప్రకాశ్ పై ఉన్నతాధికారుుల చర్యలు తీసుకున్నారు. గార్లదిన్నెకు చెందిన మహిళ నుండి ప్రకాష్ బంగారం, డబ్బు తీసుకున్నారన్న అభియోగంపై అతన్ని డిస్మిస్ చేస్తున్నట్లు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఈ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ తన నుండి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు నగదు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. కానిస్టేబుల్ ప్రకాష్ తనను ఇబ్బంది పెట్టలేదని పోలీసు ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్షసాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను డిస్మిస్ చేశారని వెల్లడించింది. లక్ష్మీ పోలీసులపై ఆరోపణలు చేయడం, డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాష్ ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయడం జిల్లాలో తీవ్ర సంచలనం అయ్యింది.