తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకపార్టీ మరో పార్టీపై ఎత్తుగడలు వేస్తున్న సమయంలో తాజాగా మరో పరిణామం తెరమీదకు వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయమే ఇందుకు కారణం. ఓ సంచలన సర్వేకు రేవంత్ రెడ్డి సిద్దమయ్యాడని టాక్ వస్తోంది.
సీనియర్లకు నచ్చట్లేదా?
త్వరలో కొత్త పీసీసీ నేత రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ సీనియర్లంతా రేవంత్రెడ్డిపై ఎదురుదాడికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీశైలం ప్రమాద అంశంలో రేవంత్ రెడ్డి వ్యవహారం, మీడియా ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమొత్తారు. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను సంప్రదించి నిరసనలు చేయాలని, తన వర్గంతో సోషల్ మీడియాతో సీఎం రేవంత్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ అంటూ పెట్టిస్తున్నపోస్టులను తొలగించాలని సూచించారు.
ఒక్కరనే కాదు..
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు రేవంత్ తీరును తప్పు పడుతున్నారు. సీనియర్ నేత వీహెచ్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు రవేంత్ అంటే భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆదివారం రేవంత్ వైఖరిని తప్పుపట్టారు. రేవంత్ ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డికి పార్టీ తరఫున షోకాజ్ నోటీసు ఇవ్వాలని సూచించారు. తానే పీసీసీ చీఫ్, తానే సీఎం అంటూ పోస్టులు పెట్టించుకుంటున్న రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో పదవి కావాలంటే సోనియా, రాహుల్ డిసైడ్ చేస్తారని, ఎవరు పడితే వారు ప్రకటించుకోరని చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. ఏ నేతల అభిమానులు వాళ్లకు అనుకూలంగా పోస్టులు పెట్టుకుంటున్నారన్నారు. స్వార్థం కోసం, హీరోయిజం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, జైళ్లకు వెళితే టీపీసీసీ రాదని సూచించారు.
సంచలన సర్వేకు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ నేతలు ఇలా విరుచుకుపడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. బూత్ లెవల్ స్థాయి నుంచి తన టీంను రెడీ చేసుకునే స్కెచ్ను రేవంత్ వేశారని సమాచారం. అన్ని కులాల వారు ఉండేలా ప్రతీ బూత్ నుంచి ఐదుగురు మెంబర్ల కమిటీని రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం ఏకంగా తమిళనాడులో ఉన్న ఒక సర్వే కంపెనీతో డీల్ చేసుకున్నారని సమాచారం. బూత్ స్థాయిలో రేవంత్ రెడ్డి తరుఫున ఐదుగురు మెంబర్స్ ను రెడీ చేయడం.. వాళ్ల ద్వారా బూత్ స్థాయిలో బలోపేతం చేయడం అని ఈ విధంగా ప్రణాళిక వేసుకొని ముందుకు సాగుతున్నారట. ఇదంతా ఎందుకు చే్తున్నారంటే…ఒకవేళ కాంగ్రెస్ లో తనకు తేడా వస్తే, కొత్త పార్టీ పెట్టుకోవడం, తన జీవిత కల అయిన సీఎం సీటు సాధించడం అని ప్రచారం జరుగుతోంది…