Rajiv Gandhi assassination case: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దోషుల్లో ఒకరైన ఏజి పెరరివలన్ 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించి విడుదలకు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పెరారివలన్ కుటుంబ సభ్యులు, ఆయనకు మద్దతుగా నిలిచినవారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో సహా పలు పార్టీల నేతలు సుప్రీం తీర్పు పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే పెరారివలన్ సహా ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగానికి గురైయ్యారు. పెరారివలన్ నివాసానికి చేరుకున్న సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. పెరారివలన్ తన తల్లి అర్పుతమ్మాళ్ కు స్పీట్స్ తినిపించారు. తండ్రి కుయిల్దాసన్ తన కుమారుడి జైలు శిక్ష ముగియడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తమిళ అనుకూల సంఘాల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సుప్రీం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా పెరారివాలన్.. ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Rajiv Gandhi assassination case: సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం – సీఎం స్టాలిన్
పెరారివాలన్ విడుదలపై సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు, ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. జైలులోనే అతను 30 ఏళ్ల జీవితాన్ని కోల్పోయాడన్నారు. ఇప్పుడు అతనికి స్వేచ్చగా బతికే అవకాశం వచ్చిందన్నారు. అతను బాగుండాలని కోరుకుంటున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. రాజీవ్ హత్య కేసులో దోషుల విడుదలకు కృషి చేస్తామని తమ పార్టీ మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో, పీఎంకే నేత రామ్ దాస్, సిపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సహా రాజకీయ నేతలు సుప్రీం తీర్పును స్వాగతించారు.
మిగిలిన దోషులను విడుదల చేయాలి – అన్నా డీఎంకే
అనేక పార్టీలు సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించగా డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ విభేదించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జీవాలా సుప్రీం కోర్టు నిర్ణయం భాధాకరమని అన్నారు. కొన్ని చట్టపరమైన అంశాల మేరకు కోర్టు పెరారివలన్ ను విడుదల చేసిందనీ, సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదని అయితే నిందితులు, హంతకులు అయిన వారు నిర్దోషులు కారని తాము గట్టిగా చెబుతున్నామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని వందల మంది తమిళులు రెండు దశాబ్దాలకుపైగా కటకటాల వెనుక మగ్గుతున్నారనీ, వారి విడుదలకు ఎవరూ ఎందుకు గొంతు ఎత్తడం లేదని ప్రశ్నించారు. వాళ్లు తమిళులు కాదా..? రాజీవ్ గాంధీని హత్య చేసిన వారు మాత్రమే తమిళులా..? అని అళగిరి ప్రశ్నించారు. రేపు ఉదయం తమ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకూ తమ నోటికి తెల్ల గుడ్డ కట్టుకుని తమ భావాలను వ్యక్తం చేస్తామని చెప్పారు. మరో పక్క ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాజీవ్ హత్య కేసులో మిగిలిన ఆరుగురు నిందితులను విడుదల చేయాలని అన్నా డీఎంకే సమన్వయకర్త పళని స్వామి, కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వంలు సంయుక్త ప్రకటనలో సుప్రీం కోర్టును కోరారు.