పరిశ్రమలు, కెమికల్ ప్లాంట్లలో ప్రమాదాలు అరుదుగా జరుగుతూంటాయి. కానీ.. వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఒకరకమైన ఆందోళన కలగడం సహజం. ప్రస్తుతం విశాఖ వాసులను ఈ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. విశాఖలో ఏం జరుగుతోంది.. ఎందుకిలా జరుగుతోందనే చర్చ జరుగుతోంది. మూడు నెలల కాలంలో భారీ ప్రమాదాలు జరగడం.. అభం శుభం తెలియని వాళ్లు మృత్యువాత పడడం విశాఖలోనే కాకుండా చుట్టు పక్కల జిల్లాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదాలు.. పర్యవసనాలు పరిశీలిస్తే..
- ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ: మే7వ తేదీన విష వాయువు స్టెరిన్ లీకేజీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనతో విశాఖ ఉలిక్కిపడింది. ప్రమాదానికి సంబంధించి యాజమాన్య నిర్లక్ష్యం ఉందనే హైపవర్ కమిటీ నివేదిక ప్రకారం కంపెనీ సిఈఓతో సహా 12 మందిని అరెస్టు చేశారు.
- విశాఖ సాల్వెంట్స్ లో వద్ద భారీ అగ్ని ప్రమాదం:రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్ లిమిటెడ్ కంపెనీలో ట్యాంకర్ పేలిపోయింది. పది కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
- హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ప్రమాదం: లోడింగ్ పనులు పరిశీలిస్తున్న సమయంలో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భారీ ప్రమాదంలో 14మంది మృతి చెందారు.
ఎన్నడూలేని విధంగా వరుస ప్రమాదాలు జరగుతూండడంతో విశాఖ వాస్తుపై చర్చ జరుగుతోంది. సీఎం జగన్ విశాఖను రాజధానిగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగష్టు 15 నుంచి పరిపాలన విశాఖ నుంచే చేయాలని భావిస్తున్నారు. దీంతో అసలు విశాఖ వాస్తు ఏంటి అని వేద పండితులు ఆరా తీస్తున్నారట. రాజకీయ నేతలు, ప్రజలు కూడా విశాఖకు శాంతి జరిపించాలని సూచిస్తున్నారట. వీటిని జగన్ అంతగా పట్టించుకోరు. మరి ఈ సంకేతాల్ని జగన్ ఎలా తీసుకుంటారో చూడాలి.