ఏపీలో రాజకీయం రంజుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అభివృద్ధి వికేంద్రీకరణ మరోవైపు రాజకీయ పార్టీల నేత మధ్య విమర్శలు- ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇదే సమయంలో అధికార వైసీపీలోని పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ముఖ్యంగా రాజధాని విశాఖ కేంద్రంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అన్నట్లుగా కాకుండా వైసీపీలోని రెండు వర్గాల మధ్య అనుకూల ప్రతికూల వర్గాలుగా మారుతోందనే మాటను రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారనే టాక్, ఈనెలలోనే ఆయన చేరిక ఉంటుందనే అంచనా అందరికీ తెలిసిందే. దీనిపై టీడీపీ నేతల కంటే వైసీపీ నేతలే ఎక్కువగా స్పందించడం ఆసక్తికరం. ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహోదగ్రుడు అవడం చర్చనీయాంశంగా మారింది. గంటా ఎంట్రీని వ్యతిరేకిస్తున్న అవంతి ఆయన్ను వీలైనంత డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖలో భూ కుంభకోణానానికి పాల్పడ్డారని, గంటా బాధ్యతలు నిర్వహించిన విద్యా శాఖలో సైకిల్ కుంభకోణం జరిగిందని గంటాను వీలైనంత చెడు చేసేందుకు అవంతి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు.
అక్కడితో ఆగకుండా గంటా అధికార పార్టీలోనే ఎపుడూ ఉంటారని, ఆయనో ఫిరాయింపు నేతగా అని విరుచుకుపడుతున్నారు. వైసీపీలో చేరిక గురించి ప్రస్తావిస్తూ తనపై కేసుల నుంచి తప్పించుకొవడానికే గంటా అధికార పార్టీలోకి రావాలని చూస్తున్నారనే సంచలన కామెంట్లు సైతం అవంతి చేసేశారు. అయితే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే వస్తుంటే స్వాగతించాల్సింది పోయి అవంతి ఎందుకు ఈ రేంజ్లో విరుచుకుపడుతున్నారనే సహజమైన డౌట్కు సమాధానం విశాఖ జిల్లా రాజకీయాలే. పాలిటిక్స్లో గంటా అవంతికి గురువు. రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలోకి వస్తే అవంతి హవా తగ్గడం ఖాయం. అది గ్రహించే ఆదిలోనే గంటా రాకకు అవంతి బ్రేక్లు వేస్తున్నారట. అందుకే అవినీతి పరుడు, కేసుల మాఫీ కోసం వస్తున్నాడు అంటూ భగ్గుమంటున్నారటని చర్చించుకుంటున్నారు.
అయితే, అవంతి కంటే బలమైన గంటా రాకకు సీఎం జగన్ ఓకే చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విశాఖలో పార్టీ మరింత బలోపేతం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడం జగన్ స్కెచ్. ఇంతటి పక్కా ప్లానింగ్తో సీఎం జగన్ ముందుకు సాగుతుంటే, అవంతి అడ్డుపడటం అంటే ధిక్కార స్వరం వినిపించడమా అనుకోవాలా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే, దాన్ని జగన్ సహిస్తారా? మరో రఘురామకృష్ణంరాజులాగా అవంతి మారిపోతారా? అనేది వేచి చూడాల్సిందే.