కరోనా మహమ్మారి మొదలై ఏడాది గడించింది. దీనికి విరుగుడు టీకా కనిపెట్టడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సీరం అనే సంస్థ తయారు చేసిన టీకాను వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఒక వాలంటీర్ మాత్రం ఈ టీకా వలన తనకు సైడ్ ఎఫెక్ట్ కలిగాయని సీరం సంస్థకి లీగల్ నోటీసులు పంపించడం.., దీన్ని ఆ సంస్థ కూడా తిప్పికొట్టడం కీలక అంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..!!
రూ. 5 కోట్లు ఇవ్వాలట..!!
చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్చె రీసెర్చ్ (శ్రీహెర్) లో గత నెల 1 న జరిగిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో అదే ప్రాంతానికి కి చెందిన 40 ఏళ్ల వ్యక్తి పాల్గొన్నాడు. తనకు వ్యాక్సిన్ ఇచ్చిన పది రోజుల తరువాత తీవ్రమైన తలనొప్పి, నాడీ సంబంధమైన సైడ్ ఎఫెక్ట్స్, వెలుతురులో ఉన్నప్పుడు, శబ్దం విన్నప్పుడు చికాకు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని పేర్కొంటూ… ఆయన నవంబర్ 21 న సీరం ఇన్స్టిట్యూట్ కి లీగల్ నోటీసులు పంపించాడు. ఈ నోటీసులలో సంస్థ నుండి రూ. 5 కోట్ల నష్ట పరిహారంతో పాటు, ఈ టీకా టెస్టింగ్, తయారీ, డిస్ట్రిబ్యూషన్ ఆపేయాలని పేర్కొన్నాడు. దీంతో సీరం ఇన్స్టిట్యూట్ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా(డీసీజీఐ), ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ (ఐఈసీ) చేరుకొని, టీకా ప్రయోగ ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు.
రూ. 100 కోట్ల కోసం సంస్థ తిప్పికొట్టింది..!
మరోపక్క కోవిషిల్డ్ వ్యాక్సిన్ తో సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న వాలంటీర్ ఆరోపణలను సీరమ్ సంస్థ కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నోటీసులోని అంశాలు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని.., వ్యాక్సిన్ ప్రయోగానికి, వాలంటీర్ ఆరోగ్య సమస్యకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సదరు వాలంటీర్ ముందుగానే ఈ సైడ్ ఎఫెక్ట్స్ పై డాక్టర్ల బృందంతో చర్చించగా.., టీకాకి వాటికి సంబంధం లేదు అంటూ కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆ వాలంటీర్ ఉద్దేశ పూర్వకంగానే జనంలోకి వెళ్లి, కంపెనీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సంస్థ చెప్తుంది. తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను సంస్థ పైకి రుద్దినందుకుగానూ రూ. 100 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా తిరిగి నోటీసులిచ్చింది.
ఈ గొడవ పక్కన పెట్టేస్తే.. “ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా” అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలు చివరి దశకు చేరాయి. మరో రెండు వారాల్లోనే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సీరం ఇన్స్టిట్యూట్ ముఖ్య ప్రతినిధి పూనావాలా చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ, ప్రయోగ వివరాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం శనివారం సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించిన సంగతి తెలిసిందే. జనవరి నాటికి కనీసం 100 మిలియన్ మోతాదులు, ఫిబ్రవరి చివరి నాటికి వందల మిలియన్లు టీకా అందుబాటులో ఉంటుందని పూనావాలా చెప్పారు.