ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పెన్నానది లో ఈ ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే సిద్ధవటం లోనీ పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు.. ప్రమాదవశాత్తు పెన్నా నదిలోపడి దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో యువకుల మృతదేహాల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.తిరుపతికి చెందిన 8 మంది యువకులు.. సిద్ధవటంలోని జరిగిన ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యారు.అందరూ కలిసి ఆడిపాడారు.ఎంతో సరదాగా గడిపారు.అయితే ఇదే తమ ఆఖరి రోజని వారు తెలుసుకోలేకపోయారు.ఈత కొట్టాలన్న హుషారు వారి ప్రాణాలను బలిగొంది.శుభకార్యం ముగియగానే ఈ ఎనిమిది మంది పెన్నా నదిలో ఈతకు వెళ్లారు.
వారిలో ఏడుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకులను తిరుపతికి చెందిన ఇరుపూరి శంకర (20), రాజేష్ (19), జగదీష్ (20),యాష్ (22),సతీష్ (20),నాని (20), తరుణ్ (20)లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు ఇద్దరి యువకుల మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక పోలీసులు తెలిపారు.సమాచారం అందగానే జిల్లా కలెక్టర్ ,ఎస్పీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు .
ప్రత్యేక గాలింపు బృందాలను అక్కడికి పంపారు. వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చారు కాగా తన సొంత జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల ద్వారా తెలుసుకున్నారని సమాచారం.గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు బాధిత కుటుంబాలకు ఇతరత్రా సహాయ సహకారాలు అందించాలని సీఎం జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.