TDP Leaders: మరో సీనియర్ టీడీపీ నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర చేతులకు కూడా బేడీలు పడ్డాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ,జేసీ బ్రదర్స్,చింతమనేని ప్రభాకర్,దేవినేని ఉమామహేశ్వరరావు,పరిటాల శ్రీరామ్ తదితరులు జైలు ఊచలు లెక్కపెట్టడం తెలిసిందే.
తాజాగా నరేంద్ర కూడా అదే గతి పట్టింది .వివరాల్లోకి వెళితే… తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నరేంద్రను అక్కడి నుంచి తమ వాహనంలో తీసుకెళ్లారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు . ఈ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసి, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీస్ లో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు!
ఇదిలావుంటే, తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక నేతగా ఎదిగిన ధూళిపాళ్ల నరేంద్ర.. టీడీపీ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతల కిలారి వెంకట రోశయ్య చేతిలో ఆయన ఓడిపోయారు. 1112 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అంతేకాదు 2010 నుంచి సంగం డెయిరీకి ఛైర్మన్గా ఉన్నారు ధూళిపాళ్ల నరేంద్ర.ఆయన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కూడా పొన్నూరు ఎమ్మెల్యే గా సేవలందించారు.సంఘం డెయిరీ చైర్మన్గా పని చేశారు.ఇంకా చెప్పాలంటే పొన్నూరు ధూళిపాళ్ల వారి ఖిల్లా అని చెప్పవచ్చు.1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదలు 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు చూస్తే కేవలం రెండుసార్లు మాత్రమే టిడిపి అక్కడ ఓడిపోయింది.1989ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టినేని వెంకట్రావు టిడిపి అభ్యర్థి వీరయ్య చౌదరిని ఓడించారు.మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర ఓడిపోయారు.మొత్తంగా చూస్తే దాదాపు ముప్పై ఏళ్లపాటు నరేంద్ర ఆయన తండ్రి వీరయ్యచౌదరి పొన్నూరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
హిట్ లిస్ట్ లో పెదబాబు చినబాబు?
అయితే ఇంతటితో టిడిపి నేతల హిట్ లిస్టు జాబితా పూర్తయిందని చెప్పలేం.ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి నేతలు ,వారి వారి జిల్లాలలో బలంగా ఉన్న టీడీపీ నాయకులనే ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వచ్చింది.కానీ జగన్ ప్రభుత్వం బుల్ ఐ ని కొట్టాలని పథక రచన చేస్తున్నట్లు సమాచారం.ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం అమరావతిని ట్రేడింగ్ వంటి అంశాలలో టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ ల పాత్ర పై తీవ్ర స్థాయిలో పరిశోధనలు సాగుతున్నాయి.వీటిలో గనుక వారు దొరికితే ఆ వెంటనే వారిని జగన్ ప్రభుత్వం బుక్ చేయటం ఖాయమని టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.