ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 72వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీకి పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ జోడో యాత్రలో ఉన్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ .. మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. మరో పక్క తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలను కేసిఆర్ తెలియజేశారు. దేశానికి మరెన్నో సంవత్సరాల పాటు సేవ చేయాలని, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని శుభాకాంక్షల సందేశాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు కేసిఆర్. గౌరవనీయులైన ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రదానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు , దే శ ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు ను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. మోడీని గతంలో కలిసిన నాటి ఓ ఫోటోను చంద్రబాబు షేర్ చేశారు.
1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో మోడీ జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోదీ, హీరా బెన్ దంపతులు. వీరి మూడవ సంతానం నరేంద్ర మోడీ.