Sandstorm: ప్రస్తుతం చైనా రాజధాని బీజింగ్ ఇసుక తుఫాను Sandstorm తో విలవిల్లాడుతుంది. అక్కడి గాలి, నేల మొత్తం ఇసుకతో నిండిపోయింది. బీజింగ్లో ప్రస్తుతం ఇసుక తుఫాను సృష్టిస్తున్న బీభత్సం వర్ణనాతీతం. గడిచిన దశాబ్దంలో వారు ఇటువంటి తుఫాను చూడలేదని చెబుతున్నారు. బీజింగ్ లో ఈ వైపరీత్యానికి వాయు కాలుష్యం ప్రధాన కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడి వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు చైనాలోని పన్నెండు ప్రావిన్సులపై ఈ ఇసుక తుఫాను ప్రభావం ఉంటుందట. గత పది సంవత్సరాలలో ఇంతటి తీవ్రమైన తుఫాను తాము చూడలేదని ఈ ఇసుక తుఫాను ఈ సారి చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది అని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ ఇసుక తుఫాను మధ్య మరియు ఉత్తర మంగోలియాలో ప్రారంభమవ్వగా తుఫానుకు చలిగాలులు తోడవడంతో ఈ తుఫాను మరింత తీవ్రంగా మారిందని, ఆ చలి గాలులను అనుసరిస్తూ దక్షిణాన ఉన్న బీజింగ్ కు చేరుకుందని చైనా వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ క్రమంలోనే తుఫాను అక్కడి గోబీ ఏడారిలోని దుమ్ము మరియు ఇసుక ప్రస్తుతం బీజింగ్ను ముంచెత్తుతోందని స్పష్టం చేసింది. చైనా ప్రభుత్వం ఈ ఇసుక తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రజలను ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్న వారిని బయటకు రావొద్దని ఆదేశించింది.
ప్రస్తుత మీడియా కథనాల ప్రకారం ఈ తాజా ఇసుక తుఫాను కారణంగా మంగోలియాలో దాదాపుగా 341 మంది గల్లంతు అయ్యినట్లు సమాచారం. అంతేకాకుండా చైనా ప్రజలు అక్కడి తుఫాను దృశ్యాలు మరియు ఫోటో లను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉండడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ లకు కొందరు బీజింగ్ లో పరిస్థితి యుగాంతం వచ్చేసిందా అన్నట్టు ఉందని కామెంట్లు పెడుతున్నారు. అయితే పట్టణ విస్తీరణ పెరగడం మరియు అడువుల విస్తీర్ణం తగ్గిపోతుండటంతో ఈ తుఫానుల తీవ్రత ఎక్కువగా ఉందని అక్కడి వాతవరణ శాఖ తెలియజేసింది.