ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆరంభంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గానూ సీఎం జగన్ కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద 3278.19 కోట్ల అంచనా వ్యయంతో భారీ ఎత్తిపోతల పథకం నిర్మించాలని భావించారు. దీనికి సంబంధించి 30 నెలల్లో పనులు పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ లను ఆహ్వానించింది.
అయితే దీనిపై తెలంగాణ కు చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలు అభ్యన్తరాలు వ్యక్తం చేశారు. కేంద్ర పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పధకం చేపడుతోందని దీన్ని అడ్డుకోవాలంటూ తెలంగాణ సర్కార్ ను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పక్షాలు కోర్టు ను ఆశ్రయించారు. దీనితో ఇది అంతర రాష్ట్ర జల వివాదంగా మారింది. దీనిపై ఎన్జీటీ రెండు మార్లు విచారించి నిర్మాణాలు చేపట్టవద్దని స్టే ఇచ్చింది. అనంతరం స్టే ఎత్తివేసింది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అక్కర లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ నెల 13న టెక్నీకల్ బిడ్లను తెరవనున్నారు. 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తి చేసి 19వ తేదీన టెండర్లను ఖరారు చెయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ తో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీటి కష్టాలు తీరిపోతాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తన దైన ముద్ర వేసుకోగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అదే స్థాయిలో భారీ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చర్యలు చేపట్టడం గమనార్హం.