కడప: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ జంట హత్యల కేసులో పునః విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. దీంతో కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఊరట లభించింది. 28ఏళ్లుగా నడుస్తున్న షాద్నగర్ జంట హత్యల కేసుకు అత్యున్నత న్యాయస్థానం పుల్స్టాప్ పెట్టింది. పునఃవిచారణ అవసరం లేదంటూ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
1990 డిసెంబర్ ఆరున మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ వద్ద శివశంకరరెడ్డి, గోపాలరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మాజీ మంత్రులు పొన్నపురెడ్డి శివారెడ్డి, రామసుబ్బారెడ్డితో పాటు 11మందిపై కేసు నమోదు అయ్యింది. కేసు విచారణ సాగుతుండగానే పొన్నపురెడ్డి శివారెడ్డి హత్యకు గురయ్యారు. 2004లో రామసుబ్బారెడ్డికి జైలు శిక్ష పడింది. 23నెలలు కారాగార శిక్షను అనుభవించారు.
అనంతరం 2006లో హైకోర్టులో కేసు విచారణకు రాగా రామసుబ్బారెడ్డిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హతుడు శంకరరెడ్డి కుమారుడు శివనారాయణ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పునః విచారణ కొనసాగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. అయితే అప్పీల్లో మెరిట్ లేదని, ఈ కేసుపై ఇక పునఃవిచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 28ఏళ్లుగా నడుస్తున్న కేసు నుండి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఊరట లభించింది.