Kathi Mahesh: సినీ విశ్లేషకుడు, దళిత మేధావి కత్తి మహేశ్ మరణంపై అనుమానపు నీడలు పరుచుకుంటున్నాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఈ తేనెతుట్టెను కదిపారు.మహేష్ మరణించి నాలుగు రోజులు అయ్యాక ఆయన తండ్రి ఓబులేసు తన కుమారుడు మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కి విజ్ఞప్తి చేశారు.
కృష్ణ మాదిగ చెప్పిందేమిటంటే?
కత్తి మహేష్ కు ప్రమాదం జరగడమే ఒక కుట్రలా కనిపిస్తోందని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా చీరాలలో ఆయన ఈ విషయమై మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు.మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే డ్రైవర్ చిన్న గాయం కూడా లేకుండా బైటపడ్డం ఏమిటని ఆయన ప్రశ్నించారు.నిజానికి డ్రైవర్ కూర్చున్న వైపే ప్రమాదం జరిగిందని, కారు దెబ్బతిన్నదని,అయినా డ్రైవర్కు గాయాలు తగల్లేదన్నారు.డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మహేష్ కు అంత తీవ్ర గాయాలు ఎలా తగిలాయి అన్నది తేలాల్సి ఉందన్నారు.ఇక ఆయనకు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రి డాక్టర్లు ప్రాణాపాయం లేదని చెబుతూ వచ్చారన్నారు.
తలకు తగిలిన గాయం పెద్దది కాదని ,కేవలం కళ్లు దెబ్బతిన్నాయని అవసరమైతే ఒక కన్ను తీసివేయాల్సి వస్తుందని వారు మహేష్ కుటుంబ సభ్యులకు చెప్పారన్నారు.మహేష్ మరణించడానికి ఐదు నిమిషాల ముందు కూడా డాక్టర్లు ఏవిధమైన ఇబ్బంది లేదని కుటుంబ సభ్యులకు చెప్పారని, ఐదు నిమిషాల తరవాత ఆయన మరణించినట్లు తెలియజేశారని కృష్ణ మాదిగ వివరించారు.ఆ అయిదు నిమిషాల్లో ఏమైందో తేలాల్సి ఉందన్నారు.కాబట్టి మహేష్ మరణంపై విచారణ జరిపించి రాష్ట్ర ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉందని కృష్ణమాదిగ చెప్పారు.పైగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ విజయానికి మహేష్ తన వంతు చేయూతను ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
మహేష్ తండ్రివీ అవే మాటలు!
కృష్ణ మాదిగ ఏవైతే చెప్పారో దాన్నే మహేష్ తండ్రి ఓబులేసు పునరుద్ఘాటించారు.మహేష్ మరణించిన విషయాన్ని ఆసుపత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు కాకుండా ముందుగా మీడియాకు చెప్పారని ఆయన ఒక కొత్త పాయింట్ తెలిపారు.ఏదేమైనా తాను వృద్ధాప్యంలో ఉన్నందున న్యాయపోరాటం చేయలేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఈ విషయంపై న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఓబులేసు కోరారు.
యాక్సిడెంట్ పై నెల్లూరు పోలీసులు విచారణ!
ఇదిలావుండగా కత్తిమహేష్ మరణం వివాదాస్పదం కావడంతో నెల్లూరు పోలీసులు ఆయన కారుకు జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టారు.కారు డ్రైవర్ సురేష్ ను వారు విచారించారు.ప్రమాదం ఎలా జరిగింది? అది జరిగాక ఏం చేశారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.మొత్తం మీద కత్తి మహేష్ మరణం అనేక పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.