శర్వానంద్ హీరోగా తన ఫామ్ ను కోల్పోయాడు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన మూడు సినిమాలు వరసగా ప్లాపయ్యాయి. ఇలాంటి బ్యాడ్ ఫామ్ లో ఉన్నప్పుడు శర్వానంద్ చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. శర్వానంద్ హీరోగా శ్రీకారం చేస్తోన్న విషయం తెల్సిందే. రైతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.
లాక్ డౌన్ కు ముందు విడుదల చేసిన ప్రీ టీజర్ ఆసక్తికరంగానే ఉంది. మరి కొద్ది రోజుల షూటింగ్ మాత్రం మిగిలుంది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. అక్టోబర్ నెలాఖరుకు షూటింగ్ పూర్తవ్వవచ్చు. ప్లాపుల్లో ఉన్నా కానీ శర్వానంద్ సినిమాలకు ఢోకా అయితే లేదు. ఎందుకంటే వరస సినిమాలకు కమిటై ఉన్నాడు.
శర్వానంద్ హీరోగా ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మహా సముద్రం అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. సిద్ధార్థ్ మరో కీలక పాత్రలో నటిస్తాడు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇక అసలు విషయానికొస్తే వెంకటేష్ చేయాల్సిన సినిమా ఒకటి ఇప్పుడు శర్వానంద్ చేయబోతున్నాడట. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్ హీరోగా ఆడవాళ్ళూ మీకు జోహార్లు అనే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు.
ఈ సినిమా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఈలోగా కిషోర్ తిరుమల రామ్ హీరోగా రెడ్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అది ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆడవాళ్ళూ మీకు జోహార్లు చిత్రం కొన్ని మార్పులు చేర్పులు తర్వాత శర్వానంద్ వద్దకు వెళ్లిందట. విన్న వెంటనే స్క్రిప్ట్ నచ్చేయడంతో శర్వా మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పాడని తెలుస్తోంది. మహా సముద్రం పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది.