Janasena Party : ఆంధ్రప్రదేశ్లో బిజెపితో ఎన్నికల పొత్తు గలిగిన జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ శతఘ్ని టీమ్ పోస్ట్ చేసిన తాజాట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. ఏపీలో మున్సిపాలిటి ఎన్నికలు, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్న వేళ ఈ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురైన సురభి వాణిదేవి గెలవాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది జనసేన శతఘ్ని.
Janasena Party : అప్పటినుండే జనసేన వైఖరిలో తేడానా?
ఏపీలో బీజేపీలో కలిసి పని చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు. అయితే తెలంగాణ విషయంలో పవన్ నుంచి అటువంటి ప్రకటన ఏదీ రాలేదు. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టాక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలోని బిజెపి బృందం ఆయనకు నచ్చజెప్పి జనసేనను ఎన్నికల బరిలో లేకుండా చేసింది.అయితే జనసేనాని పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం కూడా చేయలేదు.ఇటీవలి కాలంలో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామంటూ కొన్ని జిల్లాలకు ఇంఛార్జీలను నియమించారు జనసేన చీఫ్. ఆ మరుసటి రోజే ఆ పార్టీలో స్ట్రాంగ్ సోషల్ మీడియా హ్యండ్గా చెప్పుకునే శత్రుఘ్ని నుంచి ఈ తరహా ప్రకటన రావడం ఒకింత సంచలనం రేపింది. నేరుగా టీఆర్ఎస్కు మద్దతు అని ప్రకటించకపోయినా.. ఆ ట్వీట్ మిత్ర పక్షం బీజేపీకి చేటు చేస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఏపీలో ఇలా? తెలంగాణలో ఎలా?
ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. ఆ పార్టీ నేతలు కలిసే ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణలోనూ బీజేపీ పార్టీకి జనసేన మద్దతు ఇస్తుందనే భావన అందరిలో ఉంది. అయితే అనూహ్యంగా శతఘ్ని సేన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుకు కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి గెలవాలని కోరుకుంటున్నట్టు పోస్ట్ పెట్టింది.దీనిపై బీజేపీ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి.