Shiv Sena Vs MNS: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల రగడ రాజుకుంటోంది. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ప్రధాన కార్యాలయంపై లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేసి హనుమాన్ చాలీసా ప్లే చేయడంతో పోలీసులు స్పందించారు. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారన్న అభియోగంపై ఎంఎన్ఎస్ నేత మహేంద్ర భానుషాలిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకుని తరువాత వదిలివేశారు. జరిమానా విధించి, మరో సారి అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసు ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఎంఎన్ఎస్ నేత రాజ్ థాకరే కీలక డిమాండ్ చేసిన విదితమే. మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని ప్రకటించారు. రాజ్ థాకరే వ్యాఖ్యల అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి హనుమాన్ చాలీసా ప్లే చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. యాంపిల్ ఫైర్ తీసుకుని వెళ్లారు.
Shiv Sena Vs MNS: చట్ట వ్యతిరేకమైతే, అన్ని చూట్ల లౌడ్ స్పీకర్లు తొలగించాలి
ఈ విషయంపై ఎంఎన్ఎస్ నేత మహేంద్ర భానుషాలి మీడియాతో మాట్లాడుతూ లౌడ్ స్పీకర్లకు ఎవరూ అనుమతి తీసుకోలేదన్నారు. తమ కార్యాలయం ముందు లౌడ్ స్పీకర్ లు పెట్టడం చట్ట వ్యతిరేకమైతే, అన్ని చూట్ల లౌడ్ స్పీకర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో లౌడ్ స్పీకర్లు పెట్టి జై శ్రీరామ్ ప్లే చేస్తామని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేని రేపు కలవనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, ముంబాయిలో శివసేన, ఎంఎన్ఎస్ కార్యకర్తల మద్య కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇరుపక్షాల కార్యకర్తలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మెజార్టీ ప్రజలను ప్రభుత్వం అవమానిస్తోందని ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తుండగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎంఎన్ఎస్ విద్వేషాలను రెచ్చగొట్టేలా చూస్తుందని శివసేన కార్యకర్తలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.