ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై లాంటి నగరాల్లో అద్దెకు ఇల్లు దొరకడమే కష్టం. అలాంటిది లాటరీలో ఉచితంగా ఫ్లాట్లు గెలుచుకోవడం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (ఎంహడా) నిర్వహించిన ఈ లాటరీ.. వినోద్ షిర్కే అనే వ్యక్తికి తగిలింది. కానీ, ఫ్లాటు వాస్తు బాగోలేదంటూ ఆయన వదిలేసుకున్నారు. బీఎంసీ విభాగానికి శివసేన అధ్యక్షుడైన షిర్కే.. తనకు వచ్చిన రూ. 5.80 కోట్ల విలువైన ఫ్లాటును వదిలేశారు. ఎంహడా చరిత్రలోనే ఇంత ఖరీదైన ఫ్లాట్లు ఎప్పుడూ ఎవరికీ అమ్మలేదు. తన వాస్తు సిద్ధాంతి చెప్పడం వల్లే వీటిని వదిలేశానని షిర్కే అన్నారు.
‘‘నాకు ఒకే భవనంలో రెండు ఫ్లాట్లు లాటరీలో తగిలాయి. అయితే వాటిలో ఒకటే నేను తీసుకోగలను. నా వాస్తు సిద్ధాంతి సలహా తీసుకున్న తర్వాత వాటిలో ఖరీదైన రూ. 5.80 కోట్ల ఫ్లాటు వదిలేశాను. నా రాజకీయ, సామాజిక జీవనం బాగుండాలంటే ఫ్లాటులో కొన్ని మార్పులు చేయాలని వాస్తు సిద్ధాంతి చెప్పారు. కానీ రూ. 5.80 కోట్ల ఫ్లాటులో మార్పులు చేయకూడదని అధికారులు అన్నారు. రూ. 4.99 కోట్ల విలువైన మరో ఫ్లాటులో చేసుకోవచ్చు. దాంతో విలువైన ఫ్లాటు వద్దని అధికారులకు చెప్పేశా’’ అని వినోద్ షిర్కే చెప్పారు. ఆయన వద్దనడంతో వెయిటింగు లిస్టులో ఉన్న వేరొకరికి దాన్ని కేటాయిస్తామని ఎంహడా అధికారి ఒకరు తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?