దేశంలోనే అందరి కంటే సీనియర్ రాజకీయ నాయకుడిని నేనే అని సందర్భం దొరికినప్పడల్లా చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు గత కొద్దికాలంగా షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలయిన నాటి నుంచి చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే దిమ్మతిరిగే షాకులు ఇస్తున్నారు. ఇదే ఒరవడిలో తాజాగా ఇంకొందరు నేతలు అదే దారిలో ఉన్నారంటున్నారు.
ఆ నలుగురు ఎమ్మెల్యేలు….
గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు వైసీపీ గూటికి చేరుతూనే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్లు చంద్రబాబుకు షాకిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేల చేరిక పరంపరక కొనసాగగా ఇప్పుడు ఆ జాబితాలో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఉండనున్నట్లు సమాచారం.
చంద్రబాబు చేసిన పనికి తమ్ముళ్లు…
తెలుగుదేశం పార్టీ విషయంలో పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాలను సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలో పార్టీని గాడిన పెట్టేందుకు.. ప్రజా ఉద్యమాలను పెంచేందుకు అనుగుణంగా పార్టీ పెద్దల నిర్ణయాలు ఉండాలి. కానీ అలాంటి చర్యలు కనిపించడం లేదంటున్నారు. ఏపీలో టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటనపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది తప్ప అమలు మాత్రం లేదు. కమిటీ కూర్పు ఉంటుందని నేతలు చెబుతూ వస్తున్నప్పటికీ ప్రకటన మాత్రం వెలువడటం లేదు.
పెద్దల సంగతి ఓకే బాబు
త్వరలోనే రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారని తెలుగుదేశం ముఖ్యులు లీకులు ఇస్తుండటం, కసరత్తు పూర్తి కావడంతో రాష్ట్ర కమిటీ పేర్లు వెలువడటమే ఆలస్యం అన్నట్లుగా ద్వితీయ శ్రేణి నేతలు భావిస్తున్నారు. అయితే, అదేమీ లేకుండా పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను ప్రకటించారు. రెండు పార్లమెంట్లకు కలిపి ఒక సీనియర్ను ఇంఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు. అయితే రాష్ట్ర కమిటీ కోసం ఎదురుచూస్తున్న ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులను కాకుండా పెద్ద నాయకులకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ప్రకటించడం అంటే క్షేత్రస్థాయి నాయకులను లైట్ తీసుకోవడమేనని పలువురు పచ్చ పార్టీ నేతలు ఫీలవుతున్నారట. చెప్పుకోవడానికి కనీసం పదవి కూడా లేకుండా అధికార పార్టీపై ఎలా దూకుడుగా స్పందించగలమని వాపోతున్నారట. వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప పార్టీ బలోపేతం, పార్టీ నాయకుల్లో భరోసా నింపడంలో అధినాయకత్వం దృష్టి సారించడం లేదని కొందరు అంతర్గత సంభాషణల్లో వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల కంటే, ప్రతిపక్ష పాత్ర కంటే విమర్శలకు ప్రాధాన్యం ఇస్తే సైకిల్ సత్తా తగ్గకుండా ఏం జరుగుతుందని చర్చించుకుంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ల ఫీలింగ్స్కు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.