Nagarjuna Sagar Bypoll : నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీంద్ర కుమార్తో పాటు పలువురు నల్గొండ జిల్లా నేతలు పాల్గొన్నారు. సాగర్ బీజేపీ టికెట్ డాక్టర్ పానుగోతు రవికుమార్కు ఇవ్వడంతో.. బీజేపీలో అసంతృప్తుల సెగ తగిలింది. చివరివరకు టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు.
బైపోల్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ముందు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు. ఐతే ఇంతలోనే జిల్లా TRS ఎమ్మెల్యేలు ఆయనతో చర్చలు జరిపారు. పైళ్ల శేఖర్రెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, సైదిరెడ్డి ముగ్గురితో మాట్లాడాక అంజయ్య యాదవ్ గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. అంతేగాక మంత్రి పదవి కూడా ఇస్తామని అంజయ్య యాదవ్ కు టీఆర్ఎస్ పార్టీ ఆశ పెట్టినట్లు సమాచారం.ఉప ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీకి షాక్లా మారిందనే చెప్పాలి.ఇక ఇప్పటికే నామినేషన్ వేసిన మరో అభ్యర్థి నివేదితా రెడ్డి కూడా బిజెపి నాయకత్వంపై అలకబూనినట్లుగా తెలుస్తోంది.ఆమె కూడా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ఓవర్!
నాగార్జునసాగర్ ఉపసమరం హోరాహోరీగా సాగుతోంది. సాగర్ పోరులో ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులతోపాటు పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. 32 మంది అభ్యర్థులు 40కి పైగా సెట్ల నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, బీజేపీ 3, టీడీపీ తరపున 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ సాదాసీదాగా సాగింది. మొత్తంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగియడంతో.. పార్టీలన్నీ ప్రచారంపై సీరియస్గా దృష్టి సారించాయి.