BJP : విశాఖ స్టీల్ప్లాంట్లో వాటాలు విక్రయించాలనే కేంద్ర నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ని వేడెక్కించింది. నిత్యం ఆందోళనలే.
పార్టీలకు అతీతంగా నాయకులందరినోట ఇదేమాట. కార్మిక, ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే పాత నినాదం కొత్తగా పురుడుపోసుకుని.. అంతకంతకూ విస్తరిస్తోంది. విశాఖ స్టీల్స్ను రక్షించకునే మార్గాలతో సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయగా.. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి.. పొలిటికల్ హీట్ మరింత రాజేశారు. ముఖ్యంగా కేంద్ర నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కుదేలైంది. ఆంధ్రప్రదేశ్లో ఏదోవిధంగా స్థానంసంపాదిద్దామన్న వ్యూహాలతో ముందుకు సాగుతున్న కమలనాథులకు ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టింది.విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిజెపి నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు.ప్రజల్లో కి కూడా ఇప్పుడిప్పుడే విశాఖ జ్వాలలు వ్యాపిస్తున్నాయి.పరిస్థితి తీవ్రతను గమనించిన ఏపీ బీజేపీ నేతలు నష్ట నివారణ చర్యలకు నడుం బిగించారు.
BJP : మేమూ ఒప్పుకోము ..మా నేతలతో మాట్లాడతా౦!
ఇప్పటివరకు ఫుల్ జోష్మీదున్న నాయకులు విశాఖ ఉక్కు ఇరకాటంలో పడి ఒక్కసారిగా డల్ అయిపోయారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడతాం.. మనసు మారుస్తామంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఎక్కడికీ పోదన్నారు ఎమ్మెల్సీ మాధవ్. అందులో పనిచేసే ఉద్యోగులెవరికీ నష్టం జరగదని భరోసా ఇచ్చారాయన. 100 శాతం వాటాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలనే నిర్ణయానికి వ్యతిరేకం అన్నారు. ఈనెల 14న ఢిల్లీ వెళ్తామని.. కేంద్ర నాయకత్వంతో మాట్లాడతామని.. ప్రజల మనోభావాలు తెలియజేస్తామన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు మాజీ మంత్రి పురందేశ్వరి. స్టీల్ ప్లాంట్ ఉండాలన్నదే మా భావన అన్నారామె. రాజకీయ లబ్ధికోసం బీజేపీ పనిచేయదని, స్టీల్ప్లాంట్ కోసం మా ప్రయత్నం మేం చేస్తామన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు సైతం తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
స్టీల్ ప్లాంటే కాదు …ఇంకా చాలా ఉన్నాయి!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కొందరు రాజకీయ ప్రయోజనాలు ఆశించి అపోహలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.దేశవ్యాప్తంగా నాలుగైదు మినహా మిగతా రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలని భావిస్తున్నందువల్ల విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు జీవీఎల్ వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వ్యక్తమవుతున్న ఆందోళనలను కేంద్ర సర్కార్తో పాటు, బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తమ పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారని జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు. దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి చెబుతామన్నారు.పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల ఏపీ బీజేపీ నేతలు పూర్తి డైలమాలో ఉన్నారు.