తెలంగాణ పిసిసి చీఫ్ రేసులో ముందు వరుసలో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు బాంబు పేల్చారు.రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరుతానంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు ఆయన గతంలోనే బీజేపీలో చేరుతారని వార్తలొచ్చాయి. కానీ ఆయన మాత్రం పార్టీలో చేరలేదు.
తాజాగా ఆయన నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ..తాను బీజేపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చేశారు. “రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్ పార్టీగా ఎదుగుతుందని తొలిసారిగా చెప్పిన వ్యక్తిని నేను. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుందని తెలిసిన తరువాత ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటికీ పాల్గొనలేదు. ప్రజలు తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. ప్రజల క్షేమం కోసం కేసీఆర్ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను. తెలంగాణ అమరవీరులకు ఆత్మశాంతి కలిగేలా కేసీఆర్ ప్రజలందరిని కలుపుకుని పోవాలి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే నేను బీజేపీలో చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీనే బలపడాలని స్వామి వారిని కోరాను”అని రాజగోపాల్ రెడ్డి వివరించారు.అయితే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే ఉంటారు’ అని ఆయన అన్నారు.కాగా “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు పీసీసీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ పదవి ఎవరికైనా రావొచ్చు. ఎవరైనా సరే అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. వారు ఎంత వరకు గెలుస్తారు అనేది కాలమే నిర్ణయిస్తుంది.
తెలంగాణ రాజకీయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను.అందులో మాత్రం మార్పేమీ లేదు”అని ఆయన చెప్పారు .ఈ కొత్త ఏడాదిలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామి వారిని కోరినట్లు ఆయన తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని ఖరారు చేసే తరుణంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు రాజగోపాల్రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపడంతో రేవంత్ రెడ్డి కి ఈ పదవి దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.