YS Sharmila: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందే షర్మిలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.ఆదిలోనే అనేక హంసపాదులు ఎదురవుతున్నాయి.గత రెండు రోజుల్లో సంభవించిన రెండు పరిణామాలు షర్మిల కుఎదురు దెబ్బలుగానే కనిపిస్తున్నాయి.పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అడ్హాక్ కమిటీ సభ్యులు కొందరు మంగళవారం రాజీనామా చేశారు.ఇక బుధవారం గతంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగిని పరామర్శించడానికి వెళ్లిన షర్మిలకు అతడి ఇంటి తాళం వెక్కిరించింది.మొత్తమ్మీద రాజకీయాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆమెకు ఇప్పుడిప్పుడే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా నేత రాజీనామా!
జూలై ఎనిమిదివ తేదీన ఆమె పార్టీని స్థాపించబోతున్న నేపధ్యంలో అంతకు ముందుగా సంస్ధాగత నిర్మాణం కోసం అడ్హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్హాక్ కమీటీలో ఉన్న కొందరు వైఎస్సార్ అభిమానులు రాజీనామాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్హాక్ కమిటీకి రాజీనామా చేశారు. ఇదేబాటలో మరికొందరు సభ్యులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సూర్యాపేట జిల్లాలో ఇంకో షాక్!
ఇక ముందుగానే ప్రకటించి షర్మిల బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చారు.ఉద్యోగం రాలేదని నిరాశ నిస్పృహలతో ఆ జిల్లాలోని నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన యువకుడు నీలకంఠం సాయి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన తెలిసిందే. అతడ్ని పరామర్శించి మనో ధైర్యం నింపడానికి షర్మిల పనిగట్టుకుని సూర్యాపేట పర్యటన పెట్టుకున్నారు.మంగళవారమే ఈ పర్యటన గురించి ఆమె పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు.బుధవారం అంగరంగవైభవంగా కదిలి ఆ గ్రామం చేరుకున్నారు.అప్పుడే అసలైన ట్విస్ట్ ఆమెకు మతి పోయేలా చేసింది.ఆమె వెళ్ళేసరికి నీలకంఠం సాయి ఇంటికి తాళం వేసి ఉంది.దీంతో షర్మిల ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ నుంచి పరామర్శించడానికి వస్తే ఇంటికి తాళం వేసి కనిపించడంతో ఒకింత షాక్కు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంపై చుట్టుపక్కల వారిని షర్మిల అనుచరులు ఆరా తీశారు.షర్మిల వస్తున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, పోలీసులు నిన్న రాత్రి నీలకంఠ సాయి ఇంటికొచ్చి ఇంట్లో లేకుండా వెళ్లిపోవాలని ఆదేశించినట్టు వారు సమాచారం సేకరించారు. దీంతో తాళం వేసిన నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో షర్మిల కాసేపు మాట్లాడి కారెక్కేశారు.ఈ ఉదంతం తెలంగాణాలో వైరల్ టాపిక్ గా మారింది.