తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు హేమంత్ అనే యువకుడిని హత్య చేయడం. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. అల్లుడిని కిరాతకంగా హత్య చేయించాడు సదరు యువతి తండ్రి.
ఈ హత్య ఉదంతంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హేమంత్ హత్య కేసులో నిందితుల తొలిరోజు కస్టడీ ముగిసింది. విచారణలో హత్యకు గల కారణాలను విషయాలను నిందితులు వెల్లడించారు.ముఖ్యంగా అవంతి తండ్రి లక్ష్మారెడ్డి విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకే చంపించాం
తన కూతురు అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశామని లక్ష్మారెడ్డి చెప్పారు. మా నుంచి తప్పించుకుని హేమంత్ను ప్రేమ వివాహం చేసుకుందని… వివాహం చేసుకున్నట్లు మాకు పోలీసుల నుంచి సమాచారం వచ్చిందన్నారు. 15 సంవత్సరాలుగా బావమ్మర్ధి యుగంధర్తో మాటలు లేవన్న లక్ష్మారెడ్డి… హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చిందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం తమ దని తెలిపాడు. తాము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే అధిపత్యమని…అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చిందని లక్ష్మారెడ్డి చెప్పారని సమాచారం.
హేమంత్ తండ్రి ఏమంటున్నారంటే….
మరోవైపు,హేమంత్ తండ్రి మురళీకృష్ణ స్పందించారు. ప్రేమ పెళ్లికి అవంతిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని కులాంతర వివాహం కావడంతో వాళ్లకి ఇష్టం లేదని హేమంత్ తండ్రి మురళీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవంతి కుటుంబ సభ్యులు వెళ్ళగోట్టడం, పెళ్ళికి ఒప్పుకోకపోతే ఎక్కడికి వెళ్తారు అని తాము ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నానని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు బెదిరింపులకు పాల్పడితే పోలీసుల సమస్యలు రాజీ కుదిరిందని..నా కొడుకును చంపుతారని ఊహించలేదని మురళీకృష్ణ తెలిపాడు. అత్యంత దారుణంగా నా కొడుకును హత్య చేశారు…నా కొడుకును హత్య చేసిన వారిని వదిలి పెట్టవద్దు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అవంతి ఇంటి వద్ద…
మరోవైపు తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని హేమంత్ భార్య అవంతి సైబరాబాద్ సీపీ సజ్జనార్కు వినతిపత్రం అందించింది. అత్తామామలు లక్ష్మీరాణి, మురళీకృష్ణతో కలిసి ఆమె కమిషనర్ను కలిసి విజ్ఙప్తి చేసింది. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని కోరారు. దీంతో హేమంత్ కుటుంబ సభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. అవంతి పేరిట ఉన్న ఆస్తులను తిరిగి తండ్రికి రాసిచ్చినప్పటికీ ఎందుకు హత్య చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు పోలీసులు.
అవంతి పోరాటం
తన తండ్రి ఇంటి వద్ద అవంతి ఇప్పటికే నిరసన తెలిపే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో రోడ్డుపై బైటాయించింది. పరువు హత్యలను ఆపాలంటూ నినాదాలు చేసింది. అవంతి పోరాటానికి సీపీఐ నారాయణ సంఘీభావం తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హేమంత్ హత్య జరిగిందని నారాయణ ఆరోపించారు. నిందితులకు బెయిల్ ఇవ్వడానికి వీలు లేకుండా న్యాయవాదులు ముందుకు రావాలని కోరారు. లక్ష్మా రెడ్డితో పాటు హత్యలో పాల్గొన్న నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తర్వాత శిక్షపడేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హేమంత్ కుటుంబానికి న్యాయం జరిగేంత తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.