బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది.
తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకుడు ఆస్తులు సృష్టించాలి కానీ.. ప్రజల ఆస్తులు అమ్మకం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అయితే, దీనికి వైసీపీ తరఫున ఊహించని కౌంటర్ వచ్చింది.
టీడీపీ ఏమంటుందంటే…
టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల కోసం, భావితరాల కోసం వినియోగించాల్సిన భూములను అమ్ముకోవడం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం అని ఆరోపించారు. అప్పు తెచ్చి, భూములు అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. “పెన్షన్ కావాలంటే మీ పొలం అమ్మండి, రేషన్ కావాలంటే మీ ఇల్లు అమ్మండి అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది“ అని ఆరోపించారు. నాయకుడు అనే వాడు ప్రజలకు ఆస్తులు సృష్టించాలి కానీ.. ప్రజల ఆస్తులు అమ్మరు. బిల్డ్ ఏపీ కాదు.. రాష్ట్రాన్ని సోల్డ్ ఏపీగా మారుస్తున్నారు. అంటూ విరుచుకుపడ్డారు. విశాఖలో పారిశ్రామిక అవసరాలకు ఫకీరుతక్యాలో ఏపీఐఐసీకి కేటాయించిన భూముల్లో 3.32 ఎకరాలను ప్రభుత్వం విక్రయిస్తోంది. ఈ ప్రాంతం చుట్టూ పరిశ్రమలు, పూర్తిస్థాయి మౌలిక వసతులతో పాటు బాగా అభివృద్ధి చెందింది. గుంటూరులో కార్మిక శాఖకు చెందిన భూమిని కూడా అమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకోవాలి. ప్రజా ఆస్తులను కాపాడాలి. అని డిమాండ్ చేశారు.
వైసీపీ ఘాటు కౌంటర్
అయితే, తెలుగుదేశం విమర్శలపై అధికార వైసీపీ సైతం అదే రీతిలో స్పందించింది. రాష్ట్రాన్ని దివాలా తీయించేందుకు గతంలో చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మండిపడుతున్నారు. విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం..ప్రజల ఆదాయం పెంచేందుకు ఒక్క చర్య తీసుకుందా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన టీడీపీ సర్కారు ఆ అప్పులు , వడ్డీల భారాన్ని తమపై మోపిందని ఆరోపిస్తున్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే… దీక్షలు , కార్యక్రమాలు అంటూ ప్రజలకు చెందిన ఆస్తులు సమర్పణం చేశారని మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబు భూములు అమ్మిన దాఖలలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తే సరైంది జగన్ చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?