ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ కెరీర్లో ఓ మరక. ఆయన పార్టీని ఆటలో అరటి పండు చేసిన కామెంట్ ఆయన ఖాతాలో ఆయన తనయుడు నారా లోకేష్ ఖాతాలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ,ఈ తండ్రి కొడుకుల తీరు చర్చకు కారణంగా మారింది.
గ్రేటర్ పోరు ….
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150వార్డుల్లో 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, మజ్లీస్, టీజేఎస్, టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు తలసాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, జవదేకర్, స్మృతీ ఇరానీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రచారం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయనున్నారు. నేటితో ప్రచారం ముగిసిపోతుంది. అన్ని పార్టీల తరఫున ముఖ్య నేతలు హోరాహోరి పోరు జరుగుతోంది. కానీ టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేశ్ బాలకృష్ణ మాత్రం బల్దియా ఎన్నికలపై నోరు మెదపడం లేదు.
గ్రేటర్లో టీడీపీ ఏం చేస్తోందంటే…
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 106 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎక్కడికక్కడే అభ్యర్థులే ప్రచారం చేసుకుంటున్నారు తప్ప రాష్ట్ర నేతలు వచ్చిన దాఖలు లేవు. హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్లో ఉండి కూడా బాబు, లోకేశ్ ప్రచారానికి రాకపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. పైగా తమ పార్టీ అభ్యర్థులు గెలవరని, అందుకే పెద్దగా ప్రచారం చేయడం లేదని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.