ఎన్నికల సమయంలో నేతల జంపింగ్లు కొత్తేం కాదు. కానీ కొన్ని పరిణామాలు మరీ చిత్రంగా ఎదుటి వారు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అలాంటి జంపింగ్ ఒకటి తాజాగా తెరమీదకు వచ్చింది.
ఇదే సమయంలో సదరు నాయకుడు చేసిన కామెంట్లు మరింత ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరుతున్నారు. అయితే ఈ సమయంలో ఆయన మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశౄరు.
గ్రేటర్లో షాక్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హస్తానికి గుడ్బై చెప్పారు. సర్వే సత్యనారాయణ ఇంట్లో ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అభ్యర్థనను సర్వే సత్యనారాయణ స్వాగతించారు.
మీడియాతో మాట్లాడుతూ…
బీజేపీ నేతల సమావేశం అనంతరం సర్వే సత్యనారాయణను మీడియా పలకరించగా…సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే బీజేపీలోకి వెళ్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నాకు తల్లి.. రాహుల్ గాంధీ నా తమ్ముడు అని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పిన సర్వే సత్యనారాయణ అందుకే తాను మరో దారి చూసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మోదీనే దేశ భవిష్యత్తు. మరో 20 ఏళ్లు బీజేపీదే అధికారం అని ఆయన అన్నారు.
నా వల్లే తెలంగాణ….
తెలంగాణ ఏర్పాటుకు సోనియాను ఒప్పించింది తానేనని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కోవర్టుల వలనే కాంగ్రెస్ పతనమైందని ఆరోపించారు. ఇప్పుడు గాంధీ భవన్ పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతుంది అని అన్నారు. కాంగ్రెస్ నాశనానికి రాష్ట్ర నాయకత్వం కారణమని, దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించింది కేసీఆరేనని సంచలన కామెంట్లు చేశారు. తనలాంటి వారిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గౌరవించటం లేదని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని పేర్కొన్న సర్వే తన లాంటి వాళ్ళందరూ కష్టపడితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు.