గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోరు ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ మధ్య అన్నట్లుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీని ఎంఐఎం అండ అనే కోణంలోనే బీజేపీ టార్గెట్ చేస్తోంది.
ఎంఐఎం పార్టీ అండతోనే టీఆర్ఎస్ రాజకీయం అంటూ విమర్శలు గుప్పిస్తోంది. అయితే, ఎంఐఎం మాత్రం బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చే కామెంట్లు చేస్తోంది.
ఓవైసీ సంచలన వ్యాఖ్యలు….
ఎర్రగడ్డ డివిజన్లో ఎంఐఎం పార్టీ తరఫున ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ 52 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “ప్రజల మద్దతు ఎంఐఎం పార్టీకే ఉంది. బీజేపీ చేస్తున్న రాజకీయం సరైనది కాదు. గతంలో 44 జీహెచ్ఎంసీ స్థానాలను కైవసం చేసుకున్నాం. ఈ సారి 52 చోట్ల గెలుస్తాం. టీఆర్ఎస్తో మాకు ఎలాంటి పొత్తు లేదు. ఆయా డివిజన్లలో ఎంఐఎం పార్టీ చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. బీజేపీ హిందూత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లింలకు లేదా ? అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన కామెంట్లు
మరోవైపు టీఆర్ఎస్ మిత్రపక్షం అని చెప్పుకొనే ఎంఐఎం పార్టీకి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నారాయి. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆయన అన్నారు. కేటీఆర్ ‘చిలక’ అని పేర్కొన్న ఆయన కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లో కళ్ళు తెరిచాడని అన్నారు. మా అధినేత చెప్పినట్టు రాజకీయం మా ఇంటి గుమస్తా తో సమానం అంటూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలకు ఎంఐఎం మద్దతు ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని టీఆర్ఎస్, ఎంఐఎం గతంలో ప్లాన్ చేశాయి. ఈ క్రమంలోనే కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని రాష్ట్రంలో విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేయడం , ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.