దేశంలో ఇదో ఆసక్తికర పరిణామం. ఊహించని ఘటన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోడి, భారతీయ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, మరో వ్యాపార ప్రముఖుడు గౌతమ్ అదానీని ఏకకాలంలో టార్గెట్ చేశారు. ఇదంతా ఎవరో తెలుసా? సామాన్య రైతులు.
ఔను. కేంద్ర ప్రభుత్వం చేస్తామన్న సవరణలను రైతు సంఘాలు తిరస్కరించాయి. సవరణలు తమకు అవసరం లేదని బిల్లులు రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లులు రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్రం అంటోంది. డిసెంబర్ 8 వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించారు. ఇక్కడి వరకు తెలిసిందే. ఆ తదుపరి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
ఇప్పుడేం జరుగుతోంది?
రైతు సంఘాల ఆందోళనకు కొనసాగుతూనే ఉండటంతో దేశంలో అందరి చూపు రైతుల ఆందోళనపైనే పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం సైతం స్పందించింది. ఆందోళనకు ముగింపు పలికేలా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం కావడం లేదు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కూడా తిరస్కరించాయి రైతు సంఘాలు. ప్రభుత్వం ఐదు సవరణలు ప్రతిపాదించింది.. ఆ సవరణలను రైతు సంఘాల నేతలకు పంపి అభిప్రాయాన్ని కోరింది. ఇక, సవరణలపై చర్చించేందుకు సమావేశమైన రైతు సంఘాల ప్రతినిధులు.. కేంద్రం చేసిన ఆ ప్రతిపాదను తిరస్కరించాలని నిర్ణయం తీసుకున్నాయి.
సంచలన నిర్ణయం
బంద్ విజయవంతం కావడంతో మరోసారి దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్ 12 వ తేదీన ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్బంధం, డిసెంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలనీ రైతు సంఘాలు నిర్ణయించాయి. జియో, అదానీ ప్రొడక్ట్స్ ను నిషేదించాలని, రిలయన్స్ మాల్స్ ను నిషేదించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఇద్దరు దేశీయ వ్యాపార దిగ్గజాలను ఏకకాలంలో రైతుల ప్రతిఘటించడం సంచలనమే.