హైదరాబాద్ కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి బాగోతం గురించి తెలిసిన సంగతే. కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.
ఈ సంధర్భంగా ఎమ్మార్వోకు సంబందించిన ఇళ్లలో పెద్ద మొత్తంలో నగదు లభ్యమయింది. దీనిపై కొందరు గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు దరఖాస్తు చేసి నాగరాజు అవినీతికి అందులో చోటు కల్పించాలని కోరారు. అయితే, అలాంటి ఇంకో అవినీతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ రాణి గారి అవినీతి సంగతి తెలిస్తే…
ఈఎస్ఐ మందుల స్కామ్లో అరెస్టయిన ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం కేసులు ఏసీబీ దూకుడు పెంచింది. డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిపై మరో కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తులపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మికి చెందిన రూ.4.47 కోట్లను సీజ్ చేసింది. నిందితులిద్దరూ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. స్థిరాస్తి వ్యాపారి వద్ద నుంచి రూ. 4.47 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తి వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.. ఈ మొత్తంలో దేవికారాణిది రూ.3.37 కోట్లు కాగా, మిగతా మొత్తం నాగలక్ష్మి చెందిన డబ్బు అని సమాచారం.
అవినీతి చేయడంలో అందె వేసిన చేయి
కంచే చేను మేసినట్లు.. ప్రభుత్వ డబ్బులకు కాపలాగా ఉండాల్సిన దేవికారాణి.. అవినీతిని ప్రోత్సహించడంలో ఏ మాత్రం వెనుకాడ లేదు. 2016-18 మధ్యకాలంలో మహిధర్ మెడికల్ అండ్ సర్జికల్ నుంచి రూ.4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసింది. అయితే వీటి వాస్తవ విలువ రూ.62 లక్షలే. మిగతా రూ.3 కోట్లకు పైగా సొమ్ము దేవికారాణి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. వీటన్నింటి ఆధారాలను ఏసీబీ సంపాదించింది. జై సాయిరామ్ సంస్థ నుంచి మరో రూ. 4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు. వీటి వాస్తవ విలువ కూడా రూ. 12 లక్షలుగా బయటపడింది. తేజా ఫార్మా నుంచి రూ.5.5 కోట్ల విలువైన మందులు కొనగా.. వీటి విలువ ఒక కోటి 41 లక్షలుగా గుర్తించింది ఏసీబీ. తేజా ఫార్మా ప్రతినిధులతో కలిసి మొత్తం ఎనిమిది డొల్ల కంపెనీలను దేవికారాణి ఏర్పాటు చేసింది.
మేడమ్ గారి స్కెచ్లు మామూలు కాదు
దేవికారాణి అక్రమాలకు కొత్త నిర్వచనం చెప్పడమే కాకుండా ఓ రేంజ్లో సదరు ఎత్తుగడలు వేశారని సమాచారం.
మందుల కొనుగోలులో భాగంగా తన మనుషులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారట. రేటు కాంట్రాక్ట్ ప్రకారం లక్షల విలువైన పర్చేజ్ ఆర్డర్కు నాన్ రేట్ కాంట్రాక్ట్ లో కోట్లు చెల్లించి దోచుకున్నారు. తమ డొల్ల సంస్థల్లోనే కొనాల్సిన మందుల్ని గుర్తించేలా పర్చేజ్ ఆర్డర్లో పెద్ద అక్షరాలతో ముద్రించేవారని సమాచారం.
జల్సా లైఫ్ అంటే ఏంటో తెలుసా?
అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయల సొత్తుతో.. దేవికారాణి విలువైన ఆభరణాలు కొన్నారని, విలాసవంతమైన జీవితం గడిపారని, ఇక పార్టీలకు కొదవేలేదని ఏసీబీ తన దర్యాప్తులో గుర్తించింది. ఆమె ఏర్పాటు చేసిన షెల్ కంపెనీల నుంచి వచ్చిన సొమ్ములను కూడా ఓ జువెలరీ షాపునకు మళ్లించినట్లు తెలిసింది. ఇక్కడే రూ. 5 కోట్ల విలువైన నగలను దేవికారాణి కొన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమెకు సంబంధించి బయటకొచ్చిన వీడియోలు కలకలం రేపాయి. లక్షలు వెచ్చించి బర్త్ డే పార్టీలు నిర్వహించింది. భారీ విల్లా కొనుగోలు చేసింది. అతిపెద్ద జువెలరీ షాపులో కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసింది దేవికారాణి. చేతికి ఎముకే లేదన్నట్లుగా అవినీతి సొమ్మును ఖర్చుచేసింది. ఆమె వివరాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. దేవికారాణి అవినీతిని కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డస్లో చేర్చాలని పలువురు సెటైర్లు వేస్తున్నారు.