కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను ఒణికిస్తోంది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోని 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2,16,83,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,70,108 మంది కరోనాతో మృతి చెందారు. 1,43,87,358 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 260,496 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5410 మంది మృత్యువాత పడ్డారు. అయితే రికవరీ రేటు ఎక్కువగా, మరణాల రేటు తక్కువగా ఉండటం కాస్త ఊరట నిస్తున్నది. మన దేశంలోనూ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నా రికవరీ శాతం అధికంగా, మరణాల రేటు తక్కువగా ఉండటం ఉపశమనంగా ఉంది. కరోనాకు సంబందించి తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆసక్తికరంగా ఉంది.
కరోనా 73 రకాలట
భారత దేశంలో వాతావరణ అనుకూలతలు, ప్రతికూలతల వల్ల కరోనా మహమ్మారి 73 రకాలుగా మార్పు చెందినట్లు ఒరిస్సాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. దాదాపు 1500లకు పైగా కరోనా నమూనాలపై వారు పరిశోధన చేసిన తరువాత కోవిడ్ 19వైరస్ లో బీ 1.112, బీ 1.99 అనే రెండు జాతులు ఉన్నాయని కనుగొన్నారు. సీఎస్ఐఆర్, ఐజీఐబీ, న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒడిశా భువనేశ్వర్ కు చెందిన ఎస్ యూ ఎం శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫిసర్ జయశంకర్ వివరాలు తెలియజేస్తూ.. కరోనా ప్రధాన వైరస్ నుండి 73 రకాల ఉత్పరివర్తనలు ఏర్పడ్డాయని అన్నారు. కరోనా బలహీనత గురించి తెలుసుకుంటే చికిత్స ఎంతో సులభతరమని పేర్కొన్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనడం ఏమంత కష్టం కాదని అన్నారు. వైరస్ ఇన్ని రకాలుగా మార్పు చెందుతుండం వల్లనే కొంత మందికి కరోనా సోకినా రెండు మూడు రోజుల్లోనే తగ్గుతోందని, మరి కొంత మందికి బాగా తీవ్రతరం అవుతోందని చెప్పారు.
శాశ్వత మందులు ఎప్పుడొస్తాయో
ఇంతగా విస్తరిస్తున్న కరోనా శాశ్వత నివారణకు ఇంత వరకు మందులు రాలేదు. వాక్సిన్ కూడా రాలేదు. రష్యా విడుదల చేసిన టీకా కూడా అంతంత మాత్రంగా, పైపైన పని చేస్తుంది అని అంటున్నారు. నిజానికి కరోనా నివారణ, లేదా కరోనా పూర్తిగా నియంత్రించాలి అంటే కరోనా సోకక ముందే టీకా వేయాల్సి ఉంది. దాని మీదే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇండియాలో భారత్ బయోటెక్ తయారు చేసున్న టీకా అయినా, ఆక్స్ ఫర్డ్ టీకా అయినా సరే కరోనా వచ్చిన తరువాత పేషెంట్స్ కు వేసే ఇంజక్షన్ తప్ప దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. కరోనాను పూర్తిగా నియంత్రించాలి అంటే కరోనా రాక ముందే టీకాలు వేయాలి. అది జరగడానికి కనీసం రెండు, మూడేళ్లు పడుతుందని డబ్యూ హెచ్ ఒ చెబుతోంది.