హైదరాబాద్ .. తెలుగు వారికి పరిచయం చేయనక్కర్లేదు. దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో మన తెలుగువారికి గుర్తింపు ఇచ్చింది ఈ నగరం . కానీ ఈ నగరం ఇప్పుడు ఇంకో షాకింగ్ వార్తతో దేశంలో వార్తల్లో నిలుస్తోంది. ఎప్పట్లాగే…హైదరాబాద్ పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది.
గ్రేటర్ వాసుల్లో ఈసారి కూడా నిర్లక్ష్యం రిపీటైంది. గత ఎన్నికలతో పోల్చితే మరి దారుణంగా ఉంది. 2010లో 42 శాతం.. 2016లో 45 శాతం పోలింగ్ నమోదైతే ఈసారి సాయంత్రం 5 గంటల వరకు 35.8 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం మీద 40 శాతంలోపే పోలింగ్ నమోదయింది.
హైదరాబాద్ పరువు తీసేశారు…
గ్రేటర్ ఎన్నికల్లో నగర పౌరులు ఓటు వేసిన తీరు చర్చకు దారి తీస్తోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14 డివిజన్లలో కేవలం 5 శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. ఐటీ కారిడార్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది.
ఇదే కారణమ(ట)
ఇదిలాఉండగా, పోలింగ్ తగ్గడంపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పోలింగ్ తగ్గుదలపై అనేక అంశాలు ప్రభావం చూపించినట్లుగా పేర్కొంటున్నారు. వరుస సెలవులు రావడం. ప్రభుత్వం సెలవు ప్రకటించినా పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు లీవ్ ఇవ్వకుండా ఉండటం. వర్క్ఫ్రం హోంతో ఇప్పటికీ హైదరాబాద్ చేరుకోని ఐటీ ఉద్యోగులు. మరోవైపు కరోనా ప్రభావం గ్రేటర్ పోలింగ్పై స్పష్టంగా కనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. గుర్తుల తారుమారు వల్ల ఒక్క ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో మాత్రమే రీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్ ముగియగా ఈనెల 4న ఓట్లు లెక్కించనున్నారు.