కాలంతో సంబంధం లేకుండా వార్తల్లో నిలిచే అంశాలు కొన్ని ఉంటాయి. తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్స్టర్ నయీం ఉదంతం ఇలాంటిదే. 2016 ఆగస్టు 8వ తేదీన షాద్నగర్ దగ్గరల్లో నయీం ఎన్కౌంటర్లో మృతిచెందిన సంగతి తెలిసిందే.
నయీంతో ఎంతోమంది రాజకీయ నేతలకు, ప్రజాప్రతినిధులకు సంబంధాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ల్యాండ్ సెటిల్మెంట్, బెదిరింపుల్లో పోలీసు అధికారుల ప్రమేయం కూడా ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని క్లీన్ చీట్ ఇచ్చేశారు. ఈ ఉదంతంలో మరో ట్విస్టు తెరమీదకు వచ్చింది.
నయీంను లేపేసినపుడు ఏం జరిగిందంటే…
తెలంగాణలోని మాఫియా డాన్లలో ఒకరైన నయీం ఎన్ కౌంటర్ జరిగిన కొన్ని ఏళ్ల తర్వాత తిరిగి ఆయన కేసు తెరమీదకు వచ్చింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా నయీం కేసులో మరోసారి సంచలన విషయాలు బయటపెట్టింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీం ఇంట్లో 24 ఆయుధాలని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు కానీ, ఆ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయాన్ని మాత్రం చెప్పలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. నయీం ఇంట్లో ఏం దొరికాయో వివరంగా పేర్కొని ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరపించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇన్ని మారణాయుధాలు దొరికాయి…
నయీంను ఎన్కౌంటర్ చేసినపుడు పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 3 ఏకే-47, 3 రివాల్వర్, తొమ్మిది పిస్తోలు, 7 టపంచాలు, ఒక స్టెన్ గన్, రెండు గ్రనేడ్స్, 5 కిలోల అమ్మోనియం నైట్రేట్, 6 మ్యాగజైన్ , 612 లైవ్ బుల్లెట్ , రెండు కోట్ల 16 లక్షల రూపాయల నగదు, 2 కిలోల బంగారం, రెండున్నర కిలోల వెండి, 21 కార్లు, 26 మోటార్స్ బైక్స్, 602 సెల్ఫోన్లు, 752 భూముల పత్రాలు, ఒక్క బుల్లెట్ జాకెట్, 130 డైరీలను స్వాధీనం చేసుకున్నారని ఫోరం పేర్కొంది. అయితే, వాటికి సంబంధించిన వివరాలు మాత్రం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు అధికారులు వెల్లడించడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేసిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు.. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలంటూ గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. దీంతో మళ్లీ ఈ కేసు తెరమీదకు రానుందా? గ్యాంగ్స్టర్ నయీం ఉదంతం ఎలాంటి మలుపు తిరగనుంది? అనే చర్చ జరుగుతోంది.