కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో, హైదరాబాద్ ప్రజలకు ఓ రిలీఫ్ దక్కింది. కాస్త బయటకు వెళ్లేందుకు, కొత్త ఆహ్లాదాన్ని అనుభవించేందుకు అందుబాటులోకి వచ్చింది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ.
హైదరాబాద్ ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.. ఆసియాలోనే పెద్దదైన అద్భుతమైన కేబుల్ వంతెనను హైదరాబాద్ ప్రజలకు అంకితం చేశారు. ప్రజలకు కొత్త అందం, ఆహ్లాదం దొరికింది. అయితే, ఈ విషయంలో ప్రజలకు ఓ దుర్వార్త తెరమీదకు వచ్చింది.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ…
రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై నిర్మించిన ఆ కేబుల్ బ్రిడ్జిని కేంద్రమంత్రి జీ. కిషన్రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో దుర్గం చెరువుపై నాలుగు లేన్లతో నిర్మించిన ఈ కేబుల్ వంతెనతో జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య దూరంతోపాటు, ట్రాఫిక్ తగ్గిపోయింది. అయితే, కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో.. పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది.. వేలాది మంది కొత్త బ్రిడ్జిని చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం మాత్రమే సందర్శకులకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా తొలగించారు.
ఇప్పుడు కేబుల్ బ్రిడ్జీపైకి పోలేరు
మాదాపూర్ తీగల వంతెనపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు వంతెన మూసివేస్తున్నట్లు తెలిపారు. మిగతా రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతిని నిరాకరించారు. తీగల వంతెనపై వాహనాల వేగం 35 కి.మీ మించకూడదని స్పష్టం చేశారు. తీగల వంతెన రెయిలింగ్పై కూర్చోవడం నిషేధమని పేర్కొన్నారు. వంతెనపై పుట్టిన రోజు, ఇతర వేడుకలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంతెనపై వాహనాలు నిలపడం, మద్యం సేవించకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
షాక్కు ముందే ప్రమాదం?
అయితే, సందర్శకులకు అనుమతి విషయంలో ఈ నిబంధనలు వెలుగులోకి రాకముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సమయంలో, అనంతరం విపరీతంగా జనాలు గుమికూడటం ప్రమాదకరం అనే విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. కరోనా వైరస్ ఇంకా పోలేదనే విషయం మర్చిపోకూడదని.. మాస్క్ ధరించి తప్పనిసరిగా భౌతికదూరం పాటించడం ఉత్తమం అని ఆయన హెచ్చరించారు. ప్రజల జనజీవనం కోవిడ్కి ముందు…. కోవిడ్ తర్వాత అని చూస్కోవాల్సి వస్తుందన్న ఆయన.. ఇప్పటికే, ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు…అన్ని రంగాల్లో అన్లాకింగ్ అవుతుంది కాబట్టి ప్రజలు మరింత అలెర్ట్గా ఉంటున్నారని చెప్పారు. దుర్గం చెరువు దగ్గర ఈ మధ్యే కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితి గమనించి, ప్రజల రద్దీని నివారించేందుకు బ్రిడ్జి దగ్గరకు సందర్శకులకు ప్రభుత్వం అనుమతి నిలిపివేసిందని సమాచారం.