గత కొద్దికాలంగా తెలంగాణ కాంగ్రెస్ ఒకింత దూకుడుగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా తమిళనాడుకు చెందిన పార్టీ సీనియర్ నేత మాణికం ఠాగూర్ నియామకం అయ్యాక పార్టీ పనితీరులో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఎవరైనా దరఖాస్తుతో పాటు కొంత మొత్తం డిపాజిట్ కూడా చేయాలన్నది ఆ నిర్ణయంలో భాగమని అంటున్నారు. మాణిక్కం ఠాగూర్దే ఈ ఆలోచన అంటున్నారు.
ఠాగూర్ నిర్ణయం ఏంటంటే….
AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ పార్టీలో ఐక్యత తీసుకు రావడంతోపాటు రాష్ట్ర నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా కలగలపుకొని ముందుకు వెళుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాంటి వారిని కట్టడి చేసేందుకు గ్రేటర్లో తమిళనాడు ఫార్ములా అమలు చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించే వారు ఎవరైనా అప్లికేషన్తోపాటు పదివేల రూపాయల చెక్ను జత చేయాలి. రిజర్వుడు సీట్లలో పోటీ చేసేవారైతే 5 వేల రూపాయల చెక్ అటాచ్ చేయాల్సి ఉంటుంది.
ఎందుకు ఈ రూల్స్ అంటే?
తమిళనాడులో ఎన్నిక ఏదైనా పోటీకి ఆసక్తి కనబరిచేవారు ఎవరైనా డిపాజిట్ చేయాలనే నిబంధన ఉందట. దాంతో సగం తలనొప్పులు తగ్గాయని ఆయన తెలిపినట్టు సమాచారం. అయితే ఈ ఫార్ములా తెలంగాణలో ఎంత వరకు వర్కవుట్ అవుతుందో అన్న సందేహాలు ఉన్నాయట. తమిళనాడులో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాన్ని కోర్ కమిటీ భేటీలో ఠాగూర్ చెప్పారట.
షరతు చక్కగా పనిచేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే, కొత్త షరతు బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడే అసలైన తిరకాసు ఉంది. టికెట్ రాని వారికి డిపాజిట్ వెనక్కి ఇవ్వరట. ఆ మేరకు కోర్ కమిటీలో నిర్ణయం కూడా తీసేసుకున్నారు.