ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొత్త గేమ్ ప్లాన్ సిద్ధం చేశారు.
కీలకమైన అంశంలో జగన్ను ఇరుకున పడేసేందుకు ఆయన నూతన కార్యాచరణను నేడు అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులతో, ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి 300రోజుల ఆందోళనా కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని తెలిపారు. ఆఈ సందర్భంగా కీలకమైన సూచనలు చేశారు.
జగన్ ఊహించని రీతిలో
వరుసగా మూడు రోజుల పాటు అమరావతి అంశంలో ఆందోళనలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. నేడు రాజధాని రైతులకు, మహిళలకు, రైతుకూలీలకు సంఘీభావంగా 300 రోజుల ఆందోళనా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి అని చంద్రబాబు ఆదేశించారు. “అన్ని నియోజకవర్గాలలో ప్రెస్ మీట్ లు పెట్టాలి. రాజధాని రైతులకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలి. ఆదివారం ఉదయం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ‘‘అమరావతి పరిరక్షణ సంఘీభావ ర్యాలీలు’’ జరపాలి. ముఖ్య కూడళ్ల నుంచి 5కిమీ ర్యాలీలు నిర్వహించాలి. మహాత్మా గాంధీ, అంబేద్కర్, పూలె, ఎన్టీఆర్ విగ్రహాలకు వినతులు అందజేయాలి.. ఆదివారం రాత్రి స్కై లాంతర్ల ద్వారా నిరసన దీపాలు వెలిగించాలి. రాజధాని రైతుల త్యాగాలను ప్రజల గుండెల్లో నిలబెట్టేలా చేయాలి. సోమవారం ఉదయం 10గంటలకు అన్ని మండల రెవిన్యూ కార్యాలయాల వద్ద ‘‘ సంఘీభావ దీక్షలు, ప్రదర్శనలు’’ జరపాలి. ఈ ఆందోళనా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అన్ని ప్రజాసంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్ధులు, మేధావులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పాల్గొని సంఘీభావం తెలపాలి“ అంటూ చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.
ద్రోహం చేసిన జగన్?
అమరావతి ఆందోళనలు ప్రారంభమై 300 రోజులు అవుతున్నప్పటికీ జగన్ ప్రభుత్వంలో చలనం లేదని చంద్రబాబు మండిపడ్డారు. “రాజధానికి ప్రధాని మోది శంకుస్థాపన చేసి రేపటి విజయదశమికి 5ఏళ్లు అవుతోంది. రాజధాని నిర్మాణం, 13జిల్లాల అభివృద్దిని టిడిపి ఒక యజ్ఞంగా చేపట్టింది.. విభజన వల్ల కలిగిన నష్టాన్ని అభివృద్ది ద్వారా భర్తీ చేసేందుకు కృషి చేసింది. అభివృద్దిపై అప్పటి స్ఫూర్తిని, వైసిపి సర్వనాశనం చేసింది. రాజధాని కోసం 34వేల ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ప్రభుత్వంపై నమ్మకం అలాంటిది. ఆ రైతుల నమ్మకాన్ని నిలువునా వంచించిన చరిత్ర వైసిపి ది..ఇలా మోసం చేస్తే, ఇకపై ప్రభుత్వాన్ని నమ్మి ఏ రైతు అయినా భూమి ఇస్తాడా..? రైతుకు ద్రోహం చేస్తే నేల తల్లి క్షమించదు. “ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
అంతా కలిసి చేస్తే….
రాజధానికి ప్రధాని మోది చేతుల మీదుగా శంకుస్థాపనను హర్షించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. “ అమరావతిపై వైసిపి చేసిన దుష్ప్రచారాలు నీచాతినీచం. సొంత సామాజిక వర్గమని తప్పుడు ప్రచారం చేశారు. అమరావతిలో అత్యధికంగా ఉండేది ఎస్సీ సామాజిక వర్గం.. అమరావతికి ద్రోహం చేస్తే, మొత్తం ఎస్సీలకు ద్రోహం చేసినట్లే. అధికారంలోకి వచ్చాక వైసిపి సాధించింది ఏమిటి..? రాష్ట్రానికి, ప్రజలకు వైసిపి ఒరగ బెట్టిందేమిటి..? ఆంధ్రప్రదేశ్ అంటే దళితులపై దాడుల రాష్ట్రంగా చేశారు, ఆలయాలపై దాడుల రాష్ట్రంగా ఏపి ని మార్చారు. భూకుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా వైసిపి మారిపోయింది.“ అంటూ విరుచుకుపడ్డారు. కాగా, టీడీపీ అధ్యక్షుడి పిలుపు మేరకు పార్టీ నేతలు ఏ విధంగా ఆందోళనలు చేస్తాయో వేచి చూడాల్సిందే.