వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయాల్లో ప్రథమ స్థానంలో ఉండే అంశం రాజధానిగా అమరావతి ఒక్కటే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు అని చెప్పుకోవచ్చు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ `అమరావతి ప్రాంతంలో` చేస్తున్న ఉద్యమం ఇప్పటికే 350వ రోజులు దాటింది. అయితే ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ స్థానికులు కొందరు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఈ ఆందోళనకు ఫుల్ స్టాఫ్ పడ్డట్లు సమాచారం.
పోలీసులు, రైతులకు మధ్య …
అమరావతి పరిధిలోకి వచ్చే తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్ర బాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాజధాని రైతులు , ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మందడంలో రైతుల శిబిరంలో మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను పెట్టేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఆందోళనలు ఎత్తేస్తున్నారు
మరోవైపు అమరావతి రైతులు, మహిళలు కొత్త ఆరోపణలు చేశారు. 144 సెక్షన్ పేరుతో తమ శిబిరాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి మద్దతిచ్చిన అధికారంలోకి వచ్చాక మాటమార్చాడంటూ ఫైర్ అయ్యారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కాగడాలు, కొవ్వొత్తులు వెలిగించి శిబిరాల్లో నిరసనలు తెలిపారు. కాగా, ఈ నిరసనల తొలగింపుతో అమరావతి ఆందోళన ఆగిపోతుందా మళ్లీ కొనసాగుతుందా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.