ఆంధ్రప్రదేశ్ తెలంగాణల రాష్ట్రాల సరిహద్దుల్లో కొత్త సందడి మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పడంతో సీన్ మారిపోయింది.
జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తీసుకురావొచ్చని, జీవోను అమలు చేయాలనీ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మందుబాబులకు శుభవార్తే మరి.
అసలేం జరిగింది?
ఏపీలో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటం…పొరుగున్న ఉన్న తెలంగాణలో మద్యం ధరలు సాధారణంగా ఉండటంతో అక్రమార్కులు కొత్త రూట్లు ఎంచుకున్నారు. తెలంగాణకు సరిహద్దు జిల్లాగా ఉన్న కృష్ణాజిల్లాలోకి నిత్యం వందల కొద్దీ లీటర్ల మద్యం నిబంధనలకు విరుద్ధంగా తరలించడం మొదలుపెట్టేశారు. అధికారులు ఎన్ని విధాలుగా కాపేసి అక్రమ మద్యం వ్యాపారులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈజీ మనీ కావటంతో అక్రమార్కులు తమ దందా కొనసాగించారు. నిత్యం బోర్డర్ దగ్గర వందలాది మద్యం సీసాలను పట్టుకోవటంతోపాటు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన పరిస్థితి.
ఈ జిల్లాలో…ముఖ్యంగా ఇక్కడే ఎక్కువ
తెలంగాణ నుంచి ఏపీలోకి మద్యం తరలించడం కొన్ని ప్రాంతాలను ప్రముఖంగా పేర్కొనవచ్చు. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించటానికి ప్రధానంగా జగ్గయ్యపేట దగ్గర గరికపాడు చెక్ పోస్టు, నందిగామ పరిధిలో జొన్నలగడ్డ, కంచికచర్ల దగ్గర వీరులపాడు, తిరువురు దగ్గర, ఖమ్మం దగ్గర నుంచి వత్సవాయి చెక్ పోస్టులున్నాయి. అయితే, ప్రధానంగా తెలంగాణ సరిహద్దు జిల్లాగా ఉన్న కృష్ణా జిల్లాలోకి అక్రమ మద్యం ఏరులై ప్రవహిస్తోంది. దీన్ని ప్రతి నిత్యం ఏపీ పోలీసులు అనేక మార్గాల్లో మాటేసి పట్టుకుని అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
కృష్ణా జిల్లాలోనే…
సాధారణ చెక్ పోస్టులే కాకుండా ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవటానికి ఇంటిగ్రేట్ చెక్ పోస్టులను ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిని తెలంగాణ నుంచి ఏపీలోకి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించటానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో 27 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఈ చెక్ పోస్టుల ద్వారా అక్రమ మార్గంలో మద్యం తీసుకురావటానికి అక్రమార్కులు అన్ని అడ్డదార్లు తొక్కుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ మద్యం రవాణ విషయంలో కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో
జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తీసుకురావొచ్చని, జీవోను అమలు చేయాలనీ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక్క మద్యం బాటిల్ తో ప్రయాణం చేసినా పోలీసులు పట్టుకుంటున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మూడు మద్యం బాటిళ్లను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఏపీ మందుబాబులు పండగ చేసుకోవడం ఖాయమని అంటున్నారు.