ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆ పార్టీతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.
ఇక బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో నియామకం అయిన తర్వాత సోము వీర్రాజు అయితే, పవన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో కలసి తామే మూడవ ప్రత్యామ్నాయంగా వస్తామని, 2024లో తమ కూటమి అభ్యర్థికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని వీర్రాజు ప్రకటించేశారు. అయితే, ఇప్పుడు వారికి ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు.
జగన్.. పవన్ .. వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే, బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ నేతల్లో జోష్ పెంచేందుకే అలా మాట్లాడారు అంటూ…మొదట్లో సోము వీర్రాజు మాటలను ఏపీ ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయితే, ఆంద్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు అనేక మంది హిందువులు, భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు కారణంగానే ఇలా జరుగుతోందని వీర్రాజు విరుచుకుపడ్డారు. ఓ వైపు క్షేత్రస్థాయిలో ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి పరిస్థితిని వివరించారు. అంతర్వేది రథం దగ్ధం, ఇతర ఆలయాలలో జరిగిన ఘటనలపై గవర్నర్కు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఆయనకు పవన్ కళ్యాణ్ పార్టీ సైతం తోడు అయింది. జనసేన, బీజేపీ కలిసి జగన్ సర్కారును ఇరకాటంలో పడేసేలా పలు కార్యక్రమాలు చేపట్టాయి కూడా.
జగన్ ఎంట్రీతో….
అయితే, దీనికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని రీతిలో చెక్ పెట్టారని అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరుతుంది అన్నట్లుగా అంచనాలు వెలువడేలా జగన్ వ్యవహరించారు. ఎన్డీఏ కూటమి నుంచి పలు పార్టీలు గుడ్ బై చెప్తున్నందుకు తమ జట్టులో చేరమని బీజేపీ అధిష్ఠానం అడిగిందని.. ప్రధానితో సీఎం జగన్ భేటీలోను ఇదే ప్రధాన చర్చ జరగనుందని, జరిగిందని పలు మీడియాల్లో కథనాలు వచ్చేలా, ఇంకా చెప్పాలంటే జాతీయ స్థాయిలోనూ జోరుగా చర్చ జరిగేలా చేశారు.
ఆఖరికి …
అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం ఇటు బీజేపీ, అటు వైసీపీ ఎన్డీయేలో చేరికపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథి సోము వీర్రాజు, ఆయన టీంలో మాత్రం నిరాశా కనిపిస్తోందట. వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత వివిధ అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వరుస ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై బీజేపీది పోరాట వైఖరే అనే మూడ్ తీసుకొచ్చారు. “ఏపీ బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతోంది“ అంటూ క్యాడర్లో ఓ రేంజ్లో కాన్ఫిడెన్స్ తెచ్చారు. అయితే, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్తో కేంద్రానికి వైసీపీ దగ్గరనే ప్రచారం జనాల్లోకి వెళ్లిపోయిందని బీజేపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. వీర్రాజు వచ్చాక చేసిన ఆందోళనలు నీరుగారిపోయినట్టేనని వాపోతున్నారు. వైసీపీ స్ట్రోక్లతో తమ దూకుడుకు బ్రేక్లు పడటం ఖాయమని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే, సీఎం జగన్ ఢిల్లీ టూర్ గురించి ఏ మాత్రం స్పందించడం లేదు. మొత్తంగా ఏపీ సీఎం జగన్ టూర్ అనేక కొత్త సమీకరణాలకు తెరతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.