`తెలంగాణలో బీజేపీ బలపడుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కఠిన సమయమే` అంటూ రాజకీయ వర్గాలు ఇటీవలి పరిణామాలతో విశ్లేషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంతకంటే ఎక్కువ కష్టాలు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎదుర్కుంటోందని అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కొద్ది సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కిమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణకు కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా చెప్పాలంటే కొత్త పీసీసీ ఎంపిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది.
ఉత్తమ్ గుడ్ బై చెప్పేయడంతో ….
పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామాతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ కోసం ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాగూర్ను హైదరాబాద్కు పంపింది. బుధవారం హైదరాబాద్ నగరానికి విచ్చేసిన మాణిక్యం ఠాగూర్ శనివారం మధ్యాహ్నం దాకా అభిప్రాయ సేకరణ చేపట్టారు. దాదాపుగా పార్టీలో సీనియర్ నేతలు సహా ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారిని కూడా వ్యక్తిగతంగా కలిసి ఆయన అభిప్రాయ సేకరణ చేపట్టారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన రెండు రోజుల్లో సోనియా గాంధీకి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ సమర్పించిన నివేదిక మీద కాంగ్రెస్ పెద్దలతో సోనియాగాంధీ సమావేశమై ఒకరిని ఎన్నిక చేసే అవకాశం కనిపిస్తోంది.
కుట్ర జరిగిందా?
ఠాగూర్కు కొందరు డీసీసీ అధ్యక్షులు చెప్పిన అభిప్రాయాలు సోషల్ మీడియాకు ఎక్కాయట.. దీంతో.. పీసీసీపై ఆశలు పెట్టుకున్నవారు… పార్టీలో ఏదో జరుగుతోంది..? ఏదో కుట్ర చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో.. సీఎల్పీలో నేతలు సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది.. ఆ తర్వాత జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు.. పొడెం వీరయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఠాగూర్ను కలిశారు.. సీనియర్ల అభిప్రాయానికి ప్రాధన్యత ఇవ్వండి.. కాదని మీ ఇష్టానుసారంగా పీసీసీ ఇస్తే పార్టీలో మేం ఉండలేమని సీనియర్లు కొందరు తెగేసి చెప్పినట్టు సమాచారం… సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఏదో నిర్ణయం తీసుకుంటే.. మేం రాజీనామా చేస్తామని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.. మొత్తానికి పీసీసీ పంచాయితీ ఠాగూర్ సమక్షంలోనే జరిగిందట. ఇలా ప్రతిపక్షం తమ అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉంటే సీఎం కేసీఆర్కు ఇంకా కాంగ్రెస్ గురించి ఆందోళన చెందే చాన్స్ ఎక్కడిదని పలువురు చర్చించుకుంటున్నారు.