ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంతర్జాతీయంగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్లో ఆయన తీసుకునే నిర్ణయాలకు అంతర్జాతీయంగా ఓ గుర్తింపు ఉంది. అలా మోదీజీ ఆయన టీం ఇమేజ్ నిర్మించుకుంది. అయితే ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఈ అంశంపై స్పందించారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మోదీజీ పరువు గోవిందా చేసే ప్రయత్నం జరిగింది.
మోదీ చట్టంతో రచ్చ రచ్చ…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోకి దూసుకొస్తున్న రైతులను పోలీసులు, జవాన్లు అడ్డుకోవడం హింసాత్మకంగా మారింది. నిరసనలకు దిగుతున్న రైతులను కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో మద్దతు తెలిపారు. గురుపురబ్ సందర్భంగా సహచర కెనడా సిక్కు నేతలకు ట్రుడో విషెస్ చెప్పారు. అలాగే రైతుల పోరాటం గురించి పలు కామెంట్స్ చేశారు. ‘భారత్లో రైతుల నిరసనలకు దిగుతున్న విషయం గురించి మాట్లాడకపోతే నాకు ఉపశమనంగా అనిపించదు. అక్కడ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. మన కుటుంబాలు, స్నేహితుల గురించి మనం దిగులు పడుతున్నాం. శాంతియుత నిరసనలకు కెనడా ఎప్పుడూ మద్దతుగా నిలబడుతుంది. మేం చర్చలను విశ్వసిస్తాం. ఈ అంశం గురించి మా ఆందోళనలను భారత అధికారులకు తెలియజేయడానికి యత్నించాం’ అని ట్రుడో పేర్కొన్నారు. రైతుల నిరసనల గురించి స్పందించిన తొలి విదేశీ నేత ట్రుడో కావడం గమనార్హం.
సామ్నా సంచలనం…
ఇదిలాఉండగా , అన్నదాతలను ఉగ్రవాదులుగా చూస్తున్నారంటూ శివ సేన పార్టీ అధికారిక పత్రిక సామ్నా ఫైర్ అయింది. రైతులపై ఎందుకు దాడులు చేస్తున్నారని, అన్నదాతలు ఏమైనా టెర్రరిస్టులా అంటూ తన ఎడిటోరియల్లో మండిపడింది.
‘రైతులను టెర్రరిస్టులుగా చూస్తున్నారు. వారిపై ఢిల్లీ సరిహద్దుల్లో దాడులు చేస్తున్నారు. ఉగ్రవాదులు మన సైనికులను చంపుతున్నారు. మరి అన్నదాతలేం చేశారని వారితో అలా వ్యవహరిస్తున్నారు? బీజేపీ అరాచకాన్ని సృష్టించాలని చూస్తోంది’ అని సామ్నా రాసుకొచ్చింది. రైతుల ఉద్యమానికి ఖలిస్తాన్ తీవ్రవాదంతో లింకులు ఉన్నాయని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై సామ్నా స్పందించింది. ‘ఖలిస్తాన్ అనేది ముగిసిన అధ్యాయం. దీని కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, జనరల్ అరుణ్కుమార్ వైద్య తమ ప్రాణాలను సైతం అర్పించారు. విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం తన బలాలన్నింటినీ వాడుతోంది. కానీ శత్రు దేశాలను ఎదుర్కోవడంలో మాత్రం ఇదే సంకల్పాన్ని చూపడం లేదు’ అని సామ్నా రాసుకొచ్చింది.
చర్చలతో ఏం జరిగిందంటే…
ఇదిలాఉండగా, మంగళవారం రాత్రి విజ్ఞాన్ భవన్ లో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల సమావేశం జరిగింది. రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు కొలిక్కి రాలేదు. వ్యవసాయ చట్టాల పై చర్చకు రైతు సంఘాల నేతలు కమిటీ ఏర్పాటుతో సమస్య పరిష్కారం కాదని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతు సంఘాల నేతలు పట్టుబట్టినట్లు సమాచారం. మరోమారు గురువారం రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు జరపనున్నట్టు చెబుతున్నారు. అప్పటివరకు శాంతి పూర్వకంగా తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.