తెలంగాణలోని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ పోరులో ఓ వైపు అధికార టీఆర్ఎస్ మరోవైపు ప్రతిపక్ష బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ మాత్రం చుక్కలు చూస్తోంది.
దుబ్బాక విజయంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగి గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టగా అక్కడ మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లోనూ అదే తరహా పరిస్థితికి చేరేలా కనిపిస్తోంది. ఒక్కో నేత బీజేపీకి చేరుతుండటం గమనార్హం.
ఆపరేషన్ బీజేపీ …
తెలంగాణ బీజేపీ వ్యూహాత్మకంగా బలపడుతోంది. వివిధ పార్టీల్లో కీలకంగా పనిచేసి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలను కలిసి తెలంగాణ బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నవారిని కూడా వదలకుండా.. ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానం పలుకుతున్నారు. తాజాగా మరో నేత ఇంటికి వెళ్లి అలాగే పార్టీలోకి ఆహ్వానించారు.
కేంద్ర మాజీ మంత్రికి…
కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉన్న సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయం అయిపోయిన సంగతి తెలిసిందే. అదే కోవలో కాంగ్రెస్కు ఇంకో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతున్న తరుణంలో కాంగ్రెస్ నాయకుల్లో ఆత్మస్థైర్యం ఎక్కడ ఉంటుందని గ్రేటర్లో ఆ పార్టీ గెలుపును అంచనా వేయవచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇదిలాఉండగా, గ్రేటర్ ఎన్నికల్లో మీరే ఖర్చు పెట్టుకోవాలి.. గెలుచుకుని రావాలి అని అభ్యర్థులకు కాంగ్రెస్ నాయకులు తేల్చి చెబుతున్నారట. పార్టీ కేవలం కండువాలు.. బీఫారాలు ఇస్తుందని ముఖం మీదే తేల్చేస్తున్నారట. గ్రేటర్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి.. ఏమేం చేయాలి అన్న విషయాల్లో సీనియర్లు ఒక్క సలహా కూడా ఇవ్వడం లేదని సమాచారం.