ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్లో విరుచుకుపడుతుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆరోపణలు చేస్తుంటారు. అయితే, ఓ మంత్రిపై ప్రత్యేకంగా విమర్శలు గుప్పిస్తుంటారని చర్చ జరుగుతోంది. ఆయనే చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి.
బాబుకు ఎందుకు అంత…
వైసీపీకి చెందిన ముఖ్య నేతల్లో ఒకరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబు నాయుడుకు ఓ రేంజ్లో వ్యతిరేకత ఉందంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. నలభై ఏళ్లుగా ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉందట. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో చదువుకొనే రోజుల నుంచి వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. గత కొద్దికాలం నుంచి పాత వైరం మళ్లీ తెరమీదకు వచ్చిందంటున్నారు.
బాబును మామూలు దెబ్బ కొట్టలేదు మరి
చిత్తరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 స్థానాలలో చంద్రబాబు పోటీ చేసిన కుప్పం మినహా అన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. పెద్దిరెడ్డి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా దెబ్బతీయాని పెద్దిరెడ్డి స్కెచ్చులు వేస్తున్నారని నాయకులు పేర్కొంటున్నారు.
ఇటు బాబు అటు పెద్దిరెడ్డి
తన టార్గెట్గా పెద్దిరెడ్డి ముందుకు సాగుతుండటంతో చంద్రబాబు సైతం విరుచుకుపడుతున్నారు.
మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తుంటే.. పుంగనూరు పెద్దిరెడ్డి అడ్డాగా ఉంది. ప్రస్తుతం ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు తలదూర్చడం మొదలైంది. పుంగనూరులో అక్రమాలు జరుగుతున్నాయని.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో పెద్దిరెడ్డి బెదిరించి ఏకగ్రీవాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పంపై ఫోకస్ పెంచిన మంత్రి పెద్దిరెడ్డి మంత్రాంగంతో తెలుగుదేశం పార్టీ నుంచి గడిచిన రెండు నెలలుగా కుప్పంలో టీడీపీ నుంచి వైసీపీలోకి రాజకీయ వలసలు బాగా పెరిగాయి. దీంతో ఇటు చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డిలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తులు వేస్తున్నారు.
మండిపోయిన చంద్రబాబు…
చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కుప్పం వ్యవహారాలను అప్పగించి మరీ పెద్దిరెడ్డి తనను టార్గెట్ చేస్తుండటంతో చంద్రబాబు సైతం దూకుడు పెంచారు. పుంగనూరులో ఇసుక దందాలు నడుస్తున్నాయని.. రౌడీ రాజ్యం కొనసాగుతోందని మంత్రి పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఓం ప్రతాప్ అనే యువకుడి మరణం వెనక నిజానిజాలు వెలికి తీయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విచారణ కోరుతూ డీజీపీకి లేఖ రాశారు. ఓ న్యాయమూర్తిని పుంగనూరు నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇంతేకాకుండా తమ పార్టీ నేతలను బెదిరించి, భయపెట్టి, తాయిలాలు ఆశచూపించి లాక్కుంటున్నారని చంద్రబాబు మండిడ్డారు. చంద్రబాబును పెద్దిరెడ్డి ఉక్కిరిబిక్కిరి చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.