గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఊహించని తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. వంద సీట్లు కైవసం చేసుకుంటుందనుకున్న కారు పార్టీ ఆ మేరకు విజయం సాధించలేకపోయింది. ఊహించని రీతిలో 55 సీట్లలో గెలుపుతో ఆగిపోయింది. మరోవైపు, బీజేపీ అర్ధ సెంచరీకి చేరువ అయి సంచలనం సృష్టించింది.
గ్రేటర్లో నాలుగు సీట్ల నుంచి 48 సీట్లకు బీజేపీ చేరింది. ఈ గెలుపు టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చినట్లు చెప్తున్నారు. అయితే, ఇదే సమయంలో కొత్త రాజకీయం తెరమీదకు వచ్చిందంటున్నారు. టీఆర్ఎస్ తరఫున గెలిచిన కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని అంటున్నారు.
బీజేపీ సంచలనం …
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్లతో పాటు.. తొలి రౌండ్లోనూ ఆధిక్యంలో కొనసాగారు. 48 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ భారీ స్థాయిలో కార్పొరేటర్లు గెలవడంతో హంగ్ ఏర్పడేందుకు అవకాశం ఉందని , దీంతో కార్పొరేటర్లు పార్టీ మారవచ్చని అంచనాలు వచ్చాయి. దీనిపై ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
టీఆర్ఎస్ కూలిపోతోంది
గ్రేటర్ ఫలితాల అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్పై స్పందిస్తామన్నారు. మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన సవాల్ ను స్వీకరించాలని, టీఆర్ఎస్ పార్టీ వేగంగా ప్రజల ఆదరణను కోల్పోతోందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని కిషన్ రెడ్డి తెలిపారు. 2023లో అధికారానికి రావటానికి గ్రేటర్ ఎన్నికలు ఫ్లాట్ ఫాం అని ఆయన విశ్లేషించారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న కిషన్ రెడ్డి బీజేపీపై టీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. అక్రమ కేసులు పెట్టినా.. బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయలేదని,
కూలిపోతున్న టీఆర్ఎస్ పార్టీలోకి తమ కార్పోరేటర్లు వెళ్ళరని ధీమా వ్యక్తం చేశారు.