తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మరో మంత్రిని ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు.
ఏం చర్చించారు అంటే… ఏమో… మనకేం తెలుసు?! ఎందుకంటే ఎక్కడా అధికారిక ప్రకటన వెలువడలేదు కాబట్టి. అది అలా ఉంచితే తాజాగా కేసీఆర్ చేసిన పనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా టీం ఇరుక్కుపోయిందని టాక్ నడుస్తోంది.
ఇదో డైలీ సీరియల్ వివాదం
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు డైలీ సీరియల్ను మించిన ట్విస్టులతో సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ ఎమ్మెల్యే జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారా లేక భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నారా? అనే విషయంలో ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతోంది. దీనిపై సుప్రీంకోర్టు వరకు కేసులు సాగుతున్నాయి. తాజాగా కేంద్రంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలేం జరిగింది?
చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం నేపథ్యంలో ఎంబసీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18న కేంద్ర హోం శాఖ ను హైకోర్టు ఆదేశించింది. అయితే, కేంద్ర హోం శాఖ కేవలం మెమో మాత్రమే దాఖలు చేసింది. దీంతో మెమో దాఖలుపై కేంద్ర హోంశాఖ తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది.. కేవలం మెమో వేయడంపై కేంద్ర హోంశాఖ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. ఎంబసీ నుండి పౌరుని వివరాలు రాబట్టలేక పోతే ఎందుకు మీ హోదా? అంటూ ప్రశ్నించింది. ఫిబ్రవరి 2020లో చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే మళ్ళీ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. మరో మారు అవకాశం ఇస్తున్నాం.. జర్మన్ ఎంబసీ నుండి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది.
కేసీఆర్ మనిషి … అమిత్ షా టీంకు షాక్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ ఉదంతం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కొనసాగుతోంది. అయినప్పటికీ ఆయనకు టికెట్ దక్కింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోగా…. ఆయన పౌరసత్వంపై అఫిడవిట్ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా టీం ఇరుక్కుపోతోందని చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా, ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.