ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరుగుతున్న అనేకానేక రాజకీయ సంబంధమైన అంశాల్లో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఒకటి.
అనేకానేక ట్విస్టుల అనంతరం సీబీఐ విచారణ మొదలవగా ఇందులో ప్రస్తుతం రెండో విడత విచారణ మొదలైంది. దీంతో ఈ విచారణలో ఏం జరగనుందనే చర్చ జరుగుతోంది.
ట్విస్టుల పరంపర
వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలంటూ వైఎస్ జగన్, వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీతమ్మ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ విచారణ పిటిషన్ వైఎస్ జగన్ ఉపసంహరణ చేసుకోవడంతో ఆ పిటిషన్ను హైకోర్టు క్లోజ్ చేసింది. ఇక, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.. కేవలం వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతమ్మ పిటిషన్లపై మాత్రమే సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.
మొదటి సారి ఏం జరిగిందంటే…
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసులో సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికలను పరిశీలించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన ఆయన ఇంటిని కూడా పరిశీలించి.. అందరినీ ప్రశ్నించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్యను, వైఎస్ వివేకానంద ఇంటిలోని పనిమనుషులను, ఆయనతో పాటు పనిచేసిన వారిని సైతం ప్రశ్నించింది. ఇలా జూలైలో 2 వారాలపాటు పులివెందుల, కడపలో పలువురిని విచారించిన సీబీఐ వివేకా ఇంట్లో కేసు రీకన్స్ట్రక్షన్ చేసి పలువురిని విచారించింది.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే
వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణలో భాగంగా జూలై 31న కడప నుంచి ఢిల్లీ వెళ్లిపోయిన సీబీఐ అధికారులు దాదాపు 40 రోజుల తర్వాత పులివెందులకు చేరుకున్నారు. వివేకా హత్య కేసులో రెండో విడత విచారణను సీబీఐ అధికారులు మొదలుపెట్టారు. ఈ దఫా సీబీఐ అధికారుల విచారణ వేగంగా కొనసాగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా విచారణ అనంతరం దర్యాప్తు విషయంలో ఓ కొలిక్కి వస్తుందని సమాచారం.